అయ్యా కేసీఆర్ సారూ.. కొత్త పెన్షన్ల హామీ ఏమైంది..?

by  |
అయ్యా కేసీఆర్ సారూ.. కొత్త పెన్షన్ల హామీ ఏమైంది..?
X

దిశ, ఆసిఫాబాద్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, బోదకాలు వ్యాధిగ్రస్తులకు ఆసరా పేరుతో పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే. దివ్యాంగులకు రూ. 3016, మిగతా వారికి నెలకు రూ.2016లను అందజేస్తున్నది. గతంలో దివ్యాంగుల పెన్షన్ మినహాయించి, మిగతా పెన్షన్ల దరఖాస్తు దారులకు 65 సంవత్సరాలు నిండి ఉండాలి. కానీ ప్రభుత్వం కొత్తగా 57 సంవత్సరాలు నిండిన వారు కూడా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా వివిధ కేటగిరి పెన్షన్ల కింద 9,514 మంది దరఖాస్తు చేసుకున్నారు.

దరఖాస్తు చేసుకొని దాదాపు నెల రోజులు గడిచినా ప్రభుత్వం కొత్త పెన్షన్ ఊసే ఎత్తకపోవడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పెన్షన్ వయసును తగ్గిస్తూ ప్రకటన జారీ చేసింది. కానీ దరఖాస్తులు స్వీకరించి దాదాపు నెల రోజులు గడిచినా కొత్త పెన్షన్‌లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్నపెన్షన్ సైతం నెల చివరి వారంలో ఒక్కోసారి రెండు నెలలకు ఒకసారి అందిస్తోంది. దీంతో ప్రస్తుత పెన్షన్ దారులు పెన్షన్ వచ్చేంత వరకు ఎదురుచూడక తప్పడం లేదు. వీరి పరిస్థితి ఇలా ఉంటే కొత్త పెన్షన్ ఎప్పుడు మంజూరు అవుతాయో అని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.

కొత్తగా 9,514 దరఖాస్తులు..

ప్రభుత్వం పెన్షన్ వయసును 57 సంవత్సరాలకు తగ్గించడంతో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాల్లో కొత్తగా 9,5 14 మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఆసిఫాబాద్ మండలంలో 1,100, బెజ్జూర్‌లో 518, చింతల మానెపెళ్లిలో 439, దహెగాంలో 455, జైనూర్‌లో 433, కాగజ్ నగర్‌లో 2,688, కెరామెరిలో 349, కౌటాలలో 679, లింగాపూర్‌లో 90, పెంచికల్ పేటలో 92, రెబ్బెనలో 646, సిర్పూర్( యు)లో 163, సిర్పూర్( టీ )లో 839, తిర్యానీలో 247, వాంకిడిలో 677 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా కాగజ్‌నగర్ మండలంలో అత్యధికంగా 2,688 మంది దరఖాస్తు చేసుకోగా.. లింగాపూర్‌లో అత్యల్పంగా 90 మంది దరఖాస్తు చేసుకున్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 47,188 పెన్షన్లు..

జిల్లాలో 15 మండలాల్లో ఇప్పటివరకు 47,188 యాక్టివ్ పెన్షన్ దారులు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 17,603 వృద్ధాప్య పెన్షన్ కాగా 20,210 వితంతు పెన్షన్లు. కాగా 5,675 వికలాంగ పెన్షన్లు, 134 గీత కార్మికుల పెన్షన్లు, 489 చేనేత కార్మికుల పెన్షన్‌లు, 2,516 ఒంటరి మహిళల పెన్షన్‌లు, 82 బీడీ కార్మికుల పెన్షన్, 480 బోధకాలు వ్యాధిగ్రస్తుల పెన్షన్‌లు ఉండగా జిల్లాలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్లు లేవు. మొత్తం 49,112 పెన్షన్ తీసుకునేవారు ఉండగా వీటిలో వివిధ కారణాలతో 2,854 మంది పెన్షన్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు..

ప్రభుత్వం పెన్షన్ దారుల వయసును 57 సంవత్సరాల తగ్గించింది. దీంతో జిల్లాలో 9,514 మంది కొత్తగా పెన్షన్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. కొత్త పెన్షన్‌ల విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. ప్రభుత్వం దరఖాస్తులు పరిశీలించి మంజూరు చేయగానే కొత్త పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తాం.

-శ్రీనివాస్ అడిషనల్ డీఆర్డీఓ

Next Story

Most Viewed