దేశమంతా వద్దంటున్నా.. కేటీఆర్ కోసం తెలంగాణాలో…

by  |
ktr double decker bus memories
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశమంతా వద్దని తిరస్కరించి డబుల్​ డెక్కర్​ బస్సులను ఇప్పుడు కేవలం హైదరాబాద్​లో తిప్పేందుకు తయారు చేయాలని, దీనిపై చాలా ప్రయోగాలు చేయాల్సి వస్తుందని తయారీ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి కేటీఆర్​ చిన్ననాటి గుర్తుల్లో భాగంగా డబుల్​ డెక్కర్​ బస్సులను హైదరాబాద్​తో తిప్పేందుకు ఆర్టీసీ యుద్ధప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తూ, బస్సులను తయారీ చేసి ఇచ్చేందుకు టెండర్లకు కూడా ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం ఆయా సంస్థలతో ప్రీబిడ్​ సమావేశం జరిగింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన సమావేశంలో తయారీ సంస్థలు అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా వచ్చేనెల 5 వ తేదీ వరకు టెండర్లు స్వీకరించనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

15 ఏండ్ల కిందటే బంద్..​

డబుల్​ డెక్కర్​ బస్సుల తయారీని సంస్థలు దేశవ్యాప్తంగా పదిహేనేళ్ల కిందటే నిలిపివేశాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ బస్సులను తిప్పేందుకు నిర్ణయం తీసుకుంది. మంత్రి కేటీఆర్​ కోరిక మేరకు గ్రేటర్​లో ఈ బస్సులు నడుపనున్నారు. ముందుగా 25 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించి, నిర్మాణ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించగా నాలుగు సంస్థలు దరఖాస్తులు తీసుకున్నాయి. గురువారం నిర్వహించిన ప్రీబిడ్​ సమావేశంలో అశోక్​ లేలాండ్​, ఐషర్​, ఎంజీ ఆటోమొబైల్స్​ తరఫున ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు బస్సులు ఎలా ఉండాలనే అంశంపై సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సంస్థల ప్రతినిధులు ఆర్టీసీ అధికారులకు చాలా అంశాలపై ప్రశ్నించారు. పాత వాటి మాదిరిగా తయారీ చేయడం కష్టమేనని, అయితే పలు మార్పులు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. కాగా, మే చివరి నాటికి బస్సులు అందించే అవకాశాలను పరిశీలించాలని అధికారులు సూచించగా, ఇప్పుడు బస్సులను బీఎస్​ –6 ప్రమాణాలతోనే తయారీ చేయాల్సి ఉంటుందని, ఇంకా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది కాబట్టి సెప్టెంబర్​ నాటికి తయారీ విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కాగా, డబుల్​ డెక్కర్​ బస్సుల్లో గతంలో ఇద్దరు కండక్టర్లు విధులు నిర్వర్తించేవారు. కానీ ఈసారి మాత్రం ఒకే కండక్టర్​ ఉండేలా డిజైన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారీ వ్యయం… డబుల్​ డెక్కర్​ అవసరమా…?

డబుల్​ డెక్కర్​ బస్సులపై ఆర్టీసీ కార్మికులు, పలువురు ప్రయాణికులు కూడా పెదవి విరుస్తున్నారు. అసలే జీతాల కోసం నెలనెలా 15వ తేదీ దాటినా ఎదురుచూపుల్లో ఉంటున్న కార్మికులు డబుల్​ డెక్కర్​తో మరింత భారం అవుతుందంటున్నారు. కేవలం మంత్రి కేటీఆర్​కు చిన్ననాటి జ్ఞాపకాల కోసం ఆర్టీసీ భారాన్ని మీదేసుకుంటుందని విమర్శిస్తున్నారు. కొత్త తరం నమూనా బస్సు అయినా, నిర్వహణ వ్యయం మాత్రం తడిసి మోపెడవుతుందని ఆర్టీసీ కార్మికులు, అధికారులు ముందుగానే భయపడుతున్నారు. డబుల్​ డెక్కర్​కు అయ్యే వ్యయం ప్రభుత్వం భరిస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

గుడ్‌న్యూస్: హైదరాబాద్‌లో డబుల్​ డెక్కర్​ బస్సులు

Next Story