‘డబుల్’ పేరిట వసూళ్లు.. దళారులపై కేసు

by  |
‘డబుల్’ పేరిట వసూళ్లు.. దళారులపై కేసు
X

దిశ, సిరిసిల్ల: డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో వసూళ్లకు పాల్పడిన వారిపై ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బీపేటకు చెందిన కృష్ణ అనే వ్యక్తి తహసీల్దార్ ఆఫీసులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీకి చెందిన గన్నరాజిరెడ్డి, ఒగ్గు బాలరాజులు ఇద్దరూ జులై 14న కృష్ణకు ఫోన్ చేసి రూ.లక్ష చెల్లిస్తే డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తామని చెప్పారు.

దరఖాస్తు దారుడు తాను రూ. 30 వేలు మాత్రమే ఇచ్చుకోగలనని వారితో అన్నాడు. రూ.లక్ష ఇవ్వకపోతే వేరే వాళ్లకు మంజూరు అవుతుందని బెదిరింపులకు గురిచేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో డబుల్ బెడ్ రూమ్‌ను తనకు మంజూరు కాకుండా చేశారని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. చివరగా కృష్ణ ఫిర్యాదు మేరకు రాజిరెడ్డి, బాలరాజులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story