5g Network Trials : 5జీ ట్రయల్స్ కోసం స్పెక్ట్రమ్ కేటాయించిన టెలికాం విభాగం

by  |
5g Network Trials : 5జీ ట్రయల్స్ కోసం స్పెక్ట్రమ్ కేటాయించిన టెలికాం విభాగం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో 5జీ ట్రయల్స్ ప్రారంభించడానికి టెలికాం విభాగం(డీఓటీ) కంపెనీలకు స్పెక్ట్రమ్‌ను కేటాయించింది. ఇటీవల కంపెనీలకు 5జీ ట్రయల్స్‌కు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, గుజరాత్ ప్రాంతాల్లో ఈ పరీక్షలు జరగనున్నట్టు తెలుస్తోంది. దీనికొసం 700 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్, 3.3-3.6 గిగాహెర్ట్జ్ (జీహెచ్‌జెడ్) బ్యాండ్, 24.25-28.5 జీహెచ్‌జెడ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్‌ను కేటాయించినట్టు టెలికాం కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ నెల ప్రారంభంలో డీఓటీ దేశీయంగా 5జీ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు రిలయన్స్ జియోతో పాటు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్ఎల్ సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఈ ట్రయల్స్‌లో చైనాకు చెందిన టెక్నాలజీ వాడకూడదని డీఓటీ ఖచ్చితమైన షరతును విధించింది కూడా. ఈ నిబంధనకు లోబడి మాత్రమే కంపెనీలు నోకియా, ఎరిక్సన్, శాంసంగ్, సీ-డాట్ సంస్థల భాగస్వామ్యంతో ట్రయల్స్‌కు సిద్ధమయ్యాయి. వీటిలో రిలయన్స్ జియో మాత్రం తన సొంత టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

డీఓటీ ప్రకారం.. 5జీ టెక్నాలజీ 4జీ కన్నా పది రెట్లు మెరుగ్గా డౌన్‌లోడ్ వేగాన్ని, మూడు రెట్లు అధికంగా స్పెక్ట్రమ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. ముందుగా ట్రయల్స్‌లో టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్ డ్రోన్ ఆధారిత వ్యవసాయ పర్యవేక్షణను పరీక్షించిననున్నారు. ఈ ట్రయల్స్ ప్రక్రియ ఆరు నెలల పాటు జరుగుతుంది. కంపెనీలు కేవలం అర్బన్ ఏరియాకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో కూడా ట్రయల్స్ నిర్వహించాలి.


Next Story