అప్పుడే ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవనం: రాజన్

by  |
అప్పుడే ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవనం: రాజన్
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్నిరోజులుగా కరోనాకు వ్యాక్సిన్ గురించి సానుకూలమైన వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లోనే నమోదవుతున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ వచ్చినా సరే కొవిడ్-19 ప్రభావం కొన్నాళ్లు ఉంటుందని ఆర్థిక వేత్తలు సైతం హెచ్చరిస్తున్నారు. భారత్ లాంటి దేశాల్లో సుధీర్ఘమైన లాక్‌డౌన్‌ను విధించారు. ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నాయి అంటే పూర్తిగా నిలదొక్కుకున్నట్టు కాదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తెలిపారు.

కొవిడ్-19 ప్రభావంతో జరిగిన ఆర్థిక నష్టం ఎక్కువకాలం ఉంటుందని రఘురాం రాజన్ పేర్కొన్నారు. పలు వ్యాపారాలకు ఎక్కువ కాలంపాటు ఆదాయం లేని పరిస్థితి ఉందని, అదే సమయంలో అధికంగా వ్యయం కూడా వ్యాపారాలు మూతపడేందుకు కారణాలుగా ఉన్నాయని రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులు సుమారు 15 కోట్లకు చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి ఆస్ట్రాజెనిక లాంటి ఫార్మా కంపెనీలు కొవిడ్-19కి వ్యాక్సిన్ విషయంలో పురోగతి సాధిస్తున్నాయి.

అయితే, వ్యాక్సిన్ ఈ ఏడాదిలోనే వచ్చినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని రఘురాం రాజ అభిప్రాయపడ్డారు. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థలపై కొనసాగుతుందని, చాలామందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని, ప్రతీది ప్రణాళిక ప్రకారం జరుగుతాయా అనేది చెప్పలేమని రాజన్ తెలిపారు. నాయకుల నుంచి సహకారం ఉన్నా సరే ఆర్థిక వ్యవస్థలు అనుకున్న స్థాయిలో కోలుకునే అవకాశాలు కనబడటంలేదని రాజన్ పేర్కొన్నారు. రెస్టారెంట్, ట్రావెల్, టూరిజం లాంటి అధిక వ్యయ కార్యకలాపాలు తిరిగి పునరుజ్జీవనం పొందే వరకూ ఆర్థిక వ్యవస్థ కోలుకున్నట్టు కాదన్నారు. కరోనా ప్రభావం అధికంగా ఎదుర్కొన్న రంగాలకు ప్రభుత్వాలు దీర్ఘకాల సాయాన్ని అందించడం గురించి ఆలోచించాలని రఘురాం రాహన్ తెలిపారు.

Next Story

Most Viewed