ఆరోగ్యసేతు తప్పనిసరి.. తిండి పెట్టరు

by  |
ఆరోగ్యసేతు తప్పనిసరి.. తిండి పెట్టరు
X

ఢిల్లీ: ఈ నెల 25 నుంచి దేశీయ విమానయాన సేవలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం పౌరవిమానయాన శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. వయోవృద్ధులు, గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు విమాన ప్రయాణానికి దూరంగా ఉండాలని సూచించింది. ప్రయాణికులకు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి అని, విమానయాన సంస్థలు ఆహారం సరఫరా చేయకూడదని, ప్రయాణికులు తమ వెంట ఆహారం తీసుకెళ్లడానికి కూడా అనుమతించరని పేర్కొంది. మార్గదర్శకాలు ఇవీ…

ఎయిర్‌పోర్ట్‌లో…

– విమాన సిబ్బంది కరోనా సూట్స్‌ను తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.
– విమానయాన సిబ్బంది, ప్రయాణికుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, యంత్రాంగమే ప్రైవేటు ట్యాక్సీలు, ఇతర రవాణా సౌకర్యాలను కల్పించాలి.
– ఫ్లైట్ సమయానికి 2 గంటల ముందు విమానాశ్రయంలో రిపోర్ట్ చేయాలి
– ముఖానికి మాస్క్ తప్పనిసరి. ఎప్పుడూ మాస్క్ ధరించి ఉండాలి
– కంటైన్‌మెంట్ జోన్ ప్రాంతాల ప్రయాణికులకు అనుమతించరు
– ప్రయాణికులు తప్పకుండా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉండాలి. ఆరోగ్యసేతు యాప్ స్టేటస్‌ను ప్రయాణికులు సిబ్బందికి తప్పనిసరిగా చూపాలి. ఒకవేళ ఆరోగ్యసేతు యాప్ లేకపోతే అప్పటికప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 14 ఏండ్ల లోపు వారికి ఆరోగ్యసేతు యాప్ అవసరం లేదు.
– విమానశ్రయంలో ఉన్నంత సేపు కచ్చితంగా భౌతికదూరం పాటించాలి.
– ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి.
– విమానం బయల్దేరడానికి గంట ముందు లాగేజీని పెట్టాలి.
– బోర్డింగ్ గేట్ల దగ్గర మాస్క్, ఫేస్ షీల్డ్, శానిటైజర్‌తో కూడిన కిట్‌ను అందజేస్తారు.

విమానంలో…

– విమానం ఎక్కేటప్పుడు భౌతికదూరం పాటించాలి
– సాధ్యమైనంత వరకు మరుగుదొడ్లను వినియోగించకూడదు
– బాత్రూం దగ్గర క్యూలో నిలబడకూడదు. చిన్న పిల్లలతోపాటు పెద్దలు ఒకరిని అనుమతిస్తారు.
– విమానంలో ఆహారం సరఫరా చేయకూడదు. ప్రయాణికులు తమ వెంట ఆహారం తీసుకెళ్లడానికి కూడా అనుమతించరు. ప్రతి సీట్ దగ్గర వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచాలి.
– న్యూస్ పేపర్స్, మ్యాగజీన్లను అనుమతించరు.
– విమానం దిగిన తర్వాత బ్యాగేజీల కోసం నిలుచున్నప్పుడు భౌతిక దూరం పాటించాలి.

Next Story

Most Viewed