మిల్లర్ల లైసెన్స్‌లు రద్దు చేసే దమ్ము మంత్రికి ఉందా.?

by  |
మిల్లర్ల లైసెన్స్‌లు రద్దు చేసే దమ్ము మంత్రికి ఉందా.?
X

దిశ, తెలంగాణ బ్యూరో : మిల్లర్ల లైసెన్సులు రద్దు చేసే దమ్ము రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రికి ఉందా? అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి మాటలకే పరిమితం అయ్యారని.. చేతల్లో విఫలం అయ్యారని ఆరోపించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తరుగు పేర రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని ప్రకటనలు చేయడం కాదు.. ఎంత మంది లైసెన్స్‌లు రద్దు చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేర మిల్లర్లు దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లతో అందరూ కుమ్మక్కు కావడంతోనే తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని అన్నారు.

మిల్లర్ల కనుసన్నుల్లోనే అధికారులు నడుస్తున్నారని ఆరోపించారు. మంత్రికి చిత్త శుద్ధి ఉంటే తూకం వేయగానే రైతులకు ట్రాక్ సిట్ ఇవ్వాలని కోరారు. అలా కాకుండా మిల్లర్లు చెప్పిన తర్వాతే రైతులకు ట్రాక్ సిట్ ఇస్తున్నారని.. అంటే ఎవరి కనుసన్నలలో ధాన్యం కొనుగోలు జరుగుతుందో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో కేతకి రైస్ మిల్లు యాజమాన్యం బస్తాకు 3 కిలోలు కడ్తా తీస్తున్నారని అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కామారెడ్డిలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి అని, నిజామాబాద్ జిల్లాలో గతేడాది అసలు ధాన్యం కొనుగోలు చేయకుండానే చౌట్‌పల్లి సహకార సంఘంలో 11వేల బస్తాలు కొనుగోలు చేసినట్లు మిల్లర్లతో కుమ్మక్కై ట్రాక్ సిట్ ఇచ్చి డబ్బులు దండుకున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇదే జిల్లాలో 40 కిలోలకు 42 తూకం వేసి మళ్లీ రైస్ మిల్లర్లు క్వింటాకు 3 నుంచి 5 కిలోల వరకు కడ్తా తీస్తున్నారని, నల్గొండ, సూర్యాపేట, వరంగల్ రురల్, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్ ఇలా అన్ని జిల్లాలో ఇదే దోపిడీ కొనసాగుతుందని తెలిపారు. జిల్లాల వారీగా రైతుల నుంచి కడ్తా పేరు మీద దోపిడీకి గురైన రైతుల వివరాలు, దోపిడీ చేసిన మిల్లర్ల వివరాలు ఇస్తామని మంత్రికి చిత్త శుద్ధి ఉంటే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రకటనలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. తూకం వేసిన వెంటనే రైతులకు ట్రాక్ సిట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలను సమకూర్చడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed