రోడ్డుపై పురుడు పోసిన డాక్టర్

by  |
రోడ్డుపై పురుడు పోసిన డాక్టర్
X

దిశ,సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రి డాక్టర్ అర్జున్ తన మానవత్వాన్ని చాటు కున్నారు. కీసర వారంతపు సంతలో ప్రసవ వేదన పడుతున్న ఓ మహిళకు పురుడు పోశారు. వివరాల్లోకి వెళితే… కీసర సంతకు ఓ మహిళ మంగళ‌వారం వచ్చింది. ఇంతలో ఆమెకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడింది. స్థానికులు సమాచారాన్ని 108కు ఫోన్ ద్వారా అందించారు. 108 వాహనం ఆలస్యం అవుతుండటంతో అంతా కంగారు పడ్డారు. ఇంతలో తన పర్సనల్ పని నిమిత్తం సికింద్రబాద్ గాంధీ ఆస్పత్రి డాక్టర్ అర్జున్ అటుగా వచ్చారు.

నొప్పులతో బాధపడుతున్న ఆమహిళను చూసి చలించి పోయారు. మహిళ పరిస్థితి గమనించి రోడ్డు పక్కనే ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆమహిళకు పురుడు పోసారు. దీంతో అక్కడి స్థానికులు డాక్టర్‌ను అభినంధించారు. అనంతరం అంబులెన్స్‌లో తల్లీ,బిడ్డలకు ప్రథమ చికిత్స చేసి కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తాము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వృత్తి ధర్మానికి న్యాయం చేస్తామని మరో సారి డాక్టర్ నిరూపించాడని పలువురు హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్‌లో పురుడు పోసి వైద్య వృత్తికి వన్నె తెచ్చిన డాక్టర్ అర్జున్ సేవలు ప్రశంసనీయమని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యం. రాజారావు అన్నారు.


Next Story

Most Viewed