కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయాడు.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

by  |
DK-Aruna-1
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేస్తాం, గిట్టుబాటు ధరలు కల్పిస్తాం అని ప్రగల్భాలు పలికి, ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై నోరు పారేసుకుంటున్నారు అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ అన్నారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పబ్లిసిటీ కోసం, ప్రజలను మభ్య పెట్టడం కోసం ఇష్టం వచ్చినట్లు హామీలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని అమలు చేయడం చేతకాక తను చేతగానితనాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. ఇచ్చిన హామీలు, వాటి అమలుకు సంబంధించిన రికార్డులు మొత్తము ఉన్నాయన్న విషయం ప్రజలకు తెలుసని డీకే అరుణ చెప్పారు.

ధాన్యం కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకునే బాధ్యత రాష్ట్రానిది కాదా అని ఆమె ప్రశ్నించారు. అలా చేయడం చేతకాక ప్రధానమంత్రి మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై విమర్శలు గుప్పించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. హుజురాబాద్ ఎన్నికల ఫలితానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. నవంబర్ 4 నుండి అమలు చేస్తాం అన్న దళిత బంధు ఏమైందని అరుణ నిలదీశారు. ప్రాజెక్టుల పేర్లతో లక్షల కోట్ల రూపాయలను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటున్నదన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయలేక కేసుల పేర్లతో ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఆమె ధ్వజమెత్తారు.

మీరు కట్టిన ప్రాజెక్టులు ఏమిటో.. జరిగిన అవినీతి ఏంటో నిరూపిస్తాను.. దమ్ముంటే మా నడిగడ్డకు రావాలని సవాల్ విసిరారు. ఆంధ్ర ప్రభుత్వం వాళ్ల రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకుంటే అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ చోద్యం చూస్తూ ఉండిపోయారు అంటే వాళ్లకి మద్దతిస్తున్నట్లు కాదా.. అని ఆమె అన్నారు. ప్రపంచ దేశాల్లో కొన్ని ఆడుతున్న మన దేశం గురించి కించపరిచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం సరైన విధానం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతాపార్టీ నేతలను విమర్శిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు గడ్డం కృష్ణారెడ్డి, మండల పద్మావతి, కృష్ణవేణి, చందు, బండల వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed