తాపకొక్కటి మాట్లాడుతవేందీ..? నేనైతే అలా అనుకోను: డీకే అరుణ

by  |
తాపకొక్కటి మాట్లాడుతవేందీ..? నేనైతే అలా అనుకోను: డీకే అరుణ
X

దిశ, మహబూబ్ నగర్: ‘ఆనాడు ఏమీ చేయలేదు.. ఇప్పుడేమీ చేయడంలేదు. అసలు మీరెందుకు గట్టిగా మాట్లాడటంలేదు.. ఏమైనా చీకటి లెక్కలున్నాయా ఏందీ.. ప్రతి సారీ సెంటిమెంట్ పనిచేయదు’ అంటూ ఆమె ఆగ్రహించారు. ‘ఏందీ మీకు తెల్వదా.. తాపకొక్కటి మాట్లాడుతవేందీ.. మీకు తెల్వకుండా గదెట్లా జరుగుతది..? ఆ లెక్కలేందో బయటపెట్టాలి.. లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు’ అంటూ ఫైరయ్యారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును నిరసిస్తూ బుధవారం మహబూబ్ నగర్ లో ఆమె నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉన్న రహస్య ఒప్పందం మేరకే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జీవో 203 తీసుకొచ్చారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి తెలియకుండా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతోందని అనుకోవడంలేదని ఆమె పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో ఆనాడు రక్తం మరిగిపోతుందని మాట్లాడిన కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు గట్టిగా మాట్లాడటం లేదని నిలదీశారు. ఓ ప‌క్కా పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు త‌ర‌లించాల్సిన 2 టీఎంసీల‌కు బ‌దులు 1 టీఎంసీ కి కుదించారని, అదే సంద‌ర్భంలో పోతిరెడ్డిపాడుకు 3 టీఎంసీల నీటిని త‌ర‌లించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారంటే జ‌గ‌న్ కు, కేసీఆర్ కు మ‌ధ్య ఉన్న ర‌హ‌స్య ఒప్పందం కుదిరింద‌ని అర్థ‌వుతోందన్నారు. పోతిరెడ్డిపాడుకు అద‌నంగా 3 టీఎంసీల నీటిని త‌ర‌లించ‌డం వ‌ల‌న మ‌హ‌బుబ్ న‌గ‌ర్, న‌ల్గొండ‌, రంగారెడ్డి జిల్లాల‌తో పాటు ఖ‌మ్మంలో కొన్ని ప్రాంతాల‌కు తీవ్ర నష్టం క‌లుగుతోందని వివరించారు. తన స్వార్థం కోసం కేసీఆర్ స్వరాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఏపీ సీఎం జగన్ జీవో 203 తీసుకొచ్చారని, పోతిరెడ్డిపాడును అడ్డుపెట్టుకుని కేసీఆర్ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ పాలమూరు ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రతిసారీ సెంటిమెంట్ పనిచేయదని గుర్తించాలని సూచించారు. జీవో 203 పై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే కృష్ణా ట్రిబ్యునల్ బోర్డ్ కు, కోర్టుకు వెళ్ల‌డం కంటే ముందు ఏపీ సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి మాట్లాడాలని, వెంటనే జీఓ ర‌ద్దు చేసే విధంగా సీఎం కేసీఆర్ చోర‌వ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తెలంగాణకు న్యాయం జ‌రిగే వ‌ర‌కు బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

Next Story