దుబ్బాక పోరులో వారికి చెమటలు పడుతున్నాయ్ : డీకే అరుణ

by  |
దుబ్బాక పోరులో వారికి చెమటలు పడుతున్నాయ్ : డీకే అరుణ
X

దిశ, దుబ్బాక : దుబ్బాక ఉప ఎన్నిక కల్వకుంట్ల ఫ్యామిలీకి చెమటలు పట్టిస్తోందని బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే ధ్యేయంగా సాధించుకున్న తెలంగాణలో ఆ హామీలు ఇంకా ఎందుకు నెరవేరలేదని ఆమె ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణం స్థానిక సాయి బాలాజీ ఫంక్షన్ హాలులో బీజేపీ మద్దతుగా గొల్ల కుర్మలు నిర్వహించిన సభలో మాజీ మంత్రి బాబు మోహన్, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి డీకే అరుణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రఘునందన్‌ను గెలిపించడానికే గొల్ల కుర్మలు తరలివచ్చారని, కేసీఆర్ మీకు ఇచ్చిన హామీలను విస్మరించారని అన్నారు. టీఆర్ఎస్‌కు ఓటేస్తే గొర్లు ఇస్తామని చెప్పి.. గద్దెనెక్కాక గొల్ల కుర్మలని సీఎం మోసగించారని గుర్తుచేశారు. గొర్లన్ని కేసీఆర్ ఫాంహౌజ్‌కు తరలించారా? గొల్ల కుర్మల పిల్లలకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, పెన్షన్లు వచ్చాయా? అంటూ ప్రశ్నించారు. గజ్వేల్, సిద్ధిపేట మాదిరిగా దుబ్బాకలో రోడ్లు వేశారా? దుబ్బాక ఏం పాపం చేసింది.. ఎందుకు ఇక్కడ గుంతల రోడ్లున్నాయని ప్రశ్నించారు.

దివంగత అధికార పార్టీ ఎమ్మెల్యే రామలింగరెడ్డి దుబ్బాకను ఎందుకు డెవలప్ చేయలేదు.. పక్క నియోజకవర్గంలోనే ఆర్థిక మంత్రి హరీష్ రావు ఉండి దుబ్బాకను ఎందుకు డెవలప్ చేయలేదని మండిపడ్డారు. అమాయకులు పెట్రోల్ పోసుకుని తెలంగాణ ఉద్యమంలో చనిపోయేలా కేసీఆర్, హరీష్ రావులు రెచ్చగొట్టారని ఆ పాపం ఊరికే పోదన్నారు. రఘునందన్ డబ్బులు పంచుతున్నారని నిన్న అంతలా రెచ్చిపోతారా? దుబ్బాక ఉపఎన్నిక తీర్పు కేసీఆర్ అహంకారాన్ని దించుతుందన్నారు.



Next Story

Most Viewed