కాంట్రాక్ట్ లెక్చరర్లకు దీపావళి ఆఫర్

by  |
కాంట్రాక్ట్ లెక్చరర్లకు దీపావళి ఆఫర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఇకపైన కోరుకున్న కళాశాలల్లో చేరడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాల్సిందిగా విద్యాశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జూనియర్ లెక్చరర్లు వారికి అనువుగా ఉన్న మరో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని, నియమ నిబంధనలను అన్ని కోణాల్లో పరిశీలించి అధికారులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రగతి భవన్‌లో ఆదివారం జరిగిన సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.

తగిన అర్హత కలిగి భర్తీకి అవకాశం వున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు ఇప్పుడు వారు పనిచేస్తున్న కళాశాలల నుంచి అనువుగా ఉన్న ఇతర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేయడానికి వెళ్ళవచ్చని సీఎం సూచించారు. జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు మంత్రులు, అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే చాలా చర్యలు తీసుకున్నదని, వారిని రెగ్యలరైజ్ చేయాలనుకున్నా కోర్టులో కేసుల కారణంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. వారి జీతాలను గతంకంటే రెట్టింపు చేసిందని, గతంలో ఏడాది పది నెలలు మాత్రమే చెల్లిస్తే ఇప్పుడు పన్నెండు నెలలూ ఇస్తున్నట్లు గుర్తుచేశారు. సర్వీసు బెనిఫిట్లతో పాటు సెలవుల పెంపు, కాజువల్ లీవులు, మెటర్నిటీ లీవ్ సౌకర్యాన్ని కూడా ఇస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉదారంగానే ఉంటుందని సీఎం స్పష్టంచేశారు.


Next Story

Most Viewed