హతవిధి ఏమిటిది..? కేటీఆర్ మాటను కూడా లెక్క చేయరా?

by  |
హతవిధి ఏమిటిది..? కేటీఆర్ మాటను కూడా లెక్క చేయరా?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్, సిరిసిల్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా అధికారుల ఏర్పాట్లు హాడావుడిగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చేనాటికల్లా సిరిసిల్ల అంతా హరితమయం అయిందన్న భ్రమలు కల్పించాలన్న తాపత్రయమూ కనిపిస్తోంది. దీంతో ఎక్కడ పడితే అక్కడ పడేసిన మొక్కలు దర్శనమిస్తున్నాయి. సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్న కలెక్టరేట్ భవనం చుట్టూ నీరు చేరి జలాశయాన్ని మరిపిస్తోంది. రోడ్లపై ఏర్పాటు చేసిన భారీ ప్లైక్సీలు ప్రయాణీకుల ప్రాణాలకు సవాల్ విసురుతున్నాయ్.

కలెక్టరేట్ పరిస్థితి..

హైదరాబాద్ బైపాస్ రోడ్డులో నిర్మించిన కలెక్టరేట్ భవనం చుట్టూ భారీగా వాన నీరు వచ్చి చేరింది. దీంతో నీటిని మల్లించేందుకు అప్పటికప్పుడు కాలువలు తవ్వించారు. అయినా కూడా నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ద్వీప కల్పాన్ని మరిపిస్తోంది సిరిసిల్ల కలెక్టరేట్ భవనం. అధికారుల ముందు చూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందని స్థానికులు అంటున్నారు. కలెక్టరేట్ కు వెళ్లేందుకు బైపాస్ రోడ్డు నుండి బిల్డింగ్ వరకు వేసిన రోడ్డు రాత్రి కురిసిన వర్షానికి కొట్టుకుపోయింది. వర్షం ఇలాగే పడితే కల్వర్టు మొత్తం ఆనవాళ్లు లేకుండా పోయే ప్రమాదం లేకపోలేదు.

హరిత సిరిసిల్లనా..?

రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత ఇష్టమైన కార్యక్రమాల్లో ఒకటైన హరితహారంపైనా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన కోసం తంగెళ్లపల్లి నుండి కలెక్టరేట్ నిర్మించిన బైపాస్ రోడ్డు వరకు కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వించారు. ఇందుకోసం మొక్కలను తీసుకొచ్చి రోెడ్ల పక్కన పడేశారు. తంగళ్లపల్లి నుండి హైదరాబాద్ రోడ్డును త్వరలో ఫోర్ లైన్స్‌గా మార్చాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పెట్టారు. నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం కూడా మంజూరు చేసే అవకాశాలు లేకపోలేదు. అయినప్పటికీ అధికారులు తంగెళ్లపల్లి రహాదారి పక్కన మొక్కలు నాటడం విచిత్రం. రోడ్లు నిర్మాణం కోసం నిధులు మంజూరైతే మొక్కలు తొలగించాల్సి వస్తుందన్న విషయాన్ని అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

కేటీఆర్ మాట వినని నాయకులు

మరో వైపు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటనను స్థానిక నాయకులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్లెక్సీలు కట్టవద్దని పలుమార్లు కేటీఆర్ ప్రకటించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చిన కేటీఆర్ మాటను కూడా పెడ చెవిన పెట్టేశారు. ఆయన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలోనే ఈ పరిస్థితి కనిపిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. పట్టణంతో పాటు శివారు రోడ్ల కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిని చూసుకుంటూ వాహనదారులు వెళ్లుతున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ శాఖ నుంచి ఎవరైనా అనుమతి తీసుకున్నారా? అని కమిషనర్ సమ్మయ్యను ’దిశ‘ ప్రశ్నించగా.. తెలుసుకోని చెప్తానని అన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి అన్సార్‌ను అడగగా.. ముందు నుండే పర్మిషన్ తీసుకున్నారని చెప్తున్నారు.



Next Story

Most Viewed