ప్రగతి భవన్ చేరిన జిల్లా ఉద్యమం

by  |
ప్రగతి భవన్ చేరిన జిల్లా ఉద్యమం
X

దిశ, పరకాల: పరకాల అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని కోరుతూ చేస్తున్న ఉద్యమం నేటితో 21వ రోజుకు చేరుకుంది. ఈరోజు అమరవీరుల జిల్లా సాధన సమితి నాయకులతో పాటు కాంగ్రెస్, బిజెపి, సిపిఐ తో పాటు పలు ప్రజా సంఘాల నేతలు మంగళవారం తెలంగాణ ప్రగతి భవన్ ను ముట్టడించడం జరిగింది. గత 20 రోజులుగా అనేక పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో గత్యంతరం లేని స్థితిలో ఈరోజు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చామని పరకాల జిల్లా సాధన సమితి కన్వీనర్ పిట్ట వీరస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ వాహనాలలో హైదరాబాదులోని ప్రగతి భవన్ సమీపానికి చేరుకున్న అమరవీరుల జిల్లా సాధన సమితి నాయకులు పరకాలను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ పలు నినాదాలు చేస్తున్న క్రమంలో పంజాగుట్ట పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి గోషామాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సాధన సమితి నాయకులు పిట్టు వీరస్వామి మాట్లాడుతూ..
జిల్లా సాధించేవరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అరెస్టులతో పరకాల ప్రజల ఆకాంక్షల్ని అడ్డుకోలేరని శపథం చేశారు. ఇప్పటికైనా పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి లు కల్పించుకొని జిల్లా ఏర్పాటుకు సహకరించాలని కోరారు. లేనట్లయితే రాబోయే కాలంలో వారికి రాజకీయ భవిష్యత్తు ఉండబోదని సూచించారు. ఈ కార్యక్రమంలో అమరవీరుల జిల్లా సాధన సమితి కో కన్వీనర్లు మార్త బిక్షపతి, కాంగ్రెస్ నాయకులు కోయ్యడ శ్రీనివాస్, వెంకటస్వామి, బిజెపి నాయకులు జయంత్ లాల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story