కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. కానీ..!

by  |
కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. కానీ..!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఏడేళ్ల నిరీక్షణకు తెరపడింది.. ఏళ్లుగా పెండింగులో ఉన్న రేషన్ కార్డులకు ఎట్టకేలకు మోక్షం లభించింది.. ఏళ్లుగా పెండింగులో ఉన్న రేషను కార్డులను నేటి నుంచి పంపిణీ చేస్తున్నారు.. కొత్త కోడళ్లు, చిన్న పిల్లలకు రేషన్ కార్డులో పేర్ల నమోదుకు అవకాశం లేకపోగా.. చనిపోయిన వారి పేర్లు మాత్రం వెను వెంటనే తొలగించారు. కొత్త కార్డుల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి ఇచ్చేందుకు సర్కారు నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాజాగా 20,126 కొత్త కార్డులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు.. ఏడేళ్లుగా కొత్త రేషన్ కార్డుల ముద్రణ లేకపోగా.. తాజాగా అందించనున్నారు.

పేద ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా నిత్యవసర సరుకులు అందిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి నెలా 7,43,839కార్డులకు ప్రతినెలా 15,207మె.ట. బియ్యం అందిస్తున్నారు. రూపాయికే కిలో బియ్యం ఇవ్వగా.. మిగతా కొన్ని రకాల సరుకులు అందిస్తున్నారు. గతంలో ఒక్కో యూనిటుకు నాలుగు కిలోలు ఇవ్వగా.. కార్డుకు 20కిలోల వరకు పరిమితి ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రతి యూనిటుకు ఆరు కిలోల చొప్పున అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత పథకంలో భాగంగా ఒక్కో యూనిటుకు అయిదు కిలోల చొప్పున బియ్యం ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం మరో కిలో కలిపి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కిలోకు రూ.3.50చొప్పున అందిస్తుండగా.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.2.50రాయితీ భరిస్తోంది. పేదలకు కిలోకు రూపాయికే అందజేస్తోంది.

తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు ముద్రించలేదు. కొత్త కార్డుల ముద్రణ లేకపోవటంతో.. పాత కార్డులతోనే నెట్టుకు వస్తున్నారు. పాత కార్డులకే కొత్తగా యూనిట్లు చేర్చగా.. కేవలం నెంబరుపైనే నడుస్తోంది. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేయగా.. పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన కోడళ్లు, పిల్లలను చేర్చలేదు. దరఖాస్తు చేసినా.. అనుమతి లేకపోవటంతో రేషన్ సరుకులు అందలేదు. చనిపోయిన వారి పేర్లు వెంటవెంటనే తొలగించటంతో.. గత రెండేళ్లుగా యూనిట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజాగా కొత్త రేషను కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20,126కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో మండలాల వారీగా పంపిణీకి ఏర్పాట్లు చేశారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. మరోవైపు జూన్ 2019 నుంచి ఇప్పటికీ కొత్త యూనిట్లను చేర్చకపోగా.. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో కార్డులు రేషన్ కోటా వివరాలు (మె.ట.)

జిల్లాలు పాతకార్డులు కోటా కొత్తవి

ఆదిలాబాద్- 1,88,217 – 4,079 4,445
మంచిర్యాల- 2,14,087 – 4,093 6,686
నిర్మల్- 2,04,251 – 4,072 5,851
ఆసిఫాబాద్- 1,37,284 – 2,963 3,144
మొత్తం 7,43,839 15,207 20,126

Next Story

Most Viewed