ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు హైడ్రాక్సీ క్లోరో‌క్విన్ ట్యాబ్లెట్స్ !

by  |
ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు హైడ్రాక్సీ క్లోరో‌క్విన్ ట్యాబ్లెట్స్ !
X

దిశ, ఆదిలాబాద్: ప్రాణాంతకమైన కరోనా బారి నుండి రక్షించేందుకు ముందుండి పోరాటం సాగిస్తున్న ఫ్రంట్ లైన్ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు చేపట్టాయి. కరోనా కట్టడి నేపథ్యంలో ఇప్పటికే వైరస్ బారిన పడ్డ వారి నుండి వేగంగా ప్రభావం చూపుతుందని భావిస్తున్న ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ముందుగా రక్షించే చర్యలు ముమ్మరం చేశారు.

హైడ్రాక్సీ క్లోరో‌క్విన్ మాత్రలు…

కరోనా నివారణకు ముందుండి పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు హైడ్రాక్సీ క్లోరో‌క్విన్ మాత్రలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ నుంచి అన్ని జిల్లాలకు మాత్రలు పంపిణీ జరిగినట్లు సమాచారం. ఎవరికి పడితే వారికి అమ్మకుండా నిషేధం ఉన్న హైడ్రాక్సీ క్లోరో‌క్విన్ మాత్రలను ఆరోగ్యశాఖ ఉద్యోగులకు ముందస్తుగా అందించడం ద్వారా వారికి కరోనా రాకుండా నిరోధించవచ్చని అధికారులు భావిస్తున్నారు. జిల్లా కేంద్ర దవాఖానాలు, ఏరియా ఆస్పత్రులతోపాటు వివిధ స్థాయిల్లో పని చేస్తున్న వైద్యాధికారులు, సిబ్బందికి ఈ మాత్రలు అందిస్తారు. అలాగే క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఆరోగ్య ఉద్యోగులైన ఆశా కార్యకర్తలు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, పర్యవేక్షణ సిబ్బందితో పాటు కార్యాలయ సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నుంచి మొదలుకొని జిల్లా వైద్యాధికారి దాకా ఈ మాత్రలు పొందనున్నారు.

ఎనిమిది వారాల కోర్సు…

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్న ముందస్తు చికిత్సలో భాగంగా ఇస్తున్న మాత్రలు ఎనిమిది వారాలపాటు వాడాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. తొలివారం ప్రతి ఉద్యోగి రెండు మాత్రల చొప్పున రెండు పూటలు… ఆ తరువాత ఏడు వారాల పాటు ప్రతి వారం రెండు మాత్రల చొప్పున ఒక పూట మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. సోమవారం నుంచి అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఈ మాత్రలను తీసుకోనున్నారు. అయితే ఇప్పటికే మధుమేహం, రక్తపోటు, గుండె, మూత్రపిండాల వంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ మాత్రలు వైద్యుల పర్యవేక్షణలో ఇవ్వాలని… లేదంటే అసలు ఇవ్వకపోవడమే మంచిదన్న ఆదేశాలు కూడా వచ్చినట్లు సమాచారం.

కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్న హెచ్.సి. క్యూ మాత్రలు ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపిణీ అయ్యాయి. ముందుగా ఆరోగ్య ఉద్యోగులకు ఇచ్చిన తర్వాత ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా విషయంలో ఆరోగ్యశాఖతోపాటు దాని కట్టడికి కృషి చేస్తున్న పోలీసు, మున్సిపల్, పంచాయతీ శాఖల ఉద్యోగులకు కూడా మాత్రల పంపిణీ ఉంటుందని సమాచారం.

tags: hydroxychloroquine, tablets, medical health department, staff, hospitals, coronavirus, lockdown



Next Story

Most Viewed