బతకాలని ఉంది.. భరోసా లేదు

by  |
బతకాలని ఉంది.. భరోసా లేదు
X

దిశ,మునుగోడు: బ్రతకాలని ఉన్నా భరోసా ఇచ్చేనాథుడు లేక చావటానికి అనుమతి కోరుతున్నారు. చేసే దిక్కులేదు తల్లిదండ్రులు చేసి చేసి అలసిపోయారు. డాక్టర్లు కూడా నయం చేయలేని జబ్బుతో వారు దినదినగండంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అటు సమాజానికి దూరంగా నాలుగు గోడల మధ్య మంచానికే పరిమితమై రోజులు లెక్కపెట్టుకుంటూ బతుకు ఈడుస్తున్నా కండరాల క్షీణిత(‘ మస్క్యూలర్ డిస్ట్రోఫీ) వ్యాధిగ్రస్తుల బాధలపై దిశ’ ప్రత్యేక కథనం.

వ్యాధిగ్రస్తుల అవస్థలు..

కండరాల క్షీణిత అంటే ఇప్పటికీ సమాజంలో చాలామందికి అవగాహన లేని వ్యాధి. ఈ వ్యాధితో బాధ పడేవారు ఒకరి సహాయం లేనిదే ఏ పని చేసుకోలేరు. కండరాలు క్షీణిస్తూ రోజురోజుకు శరీరాన్ని కొరుక్కు తింటుంది. పసిపిల్లలకు ఎలా సేవలు చేయాలో ఈ వ్యాధిగ్రస్తులకు అలాగే సేవలు చేయాల్సి ఉంటుంది. వీరి దేహంలో ఉన్న ఏ ఒక్క అవయము కూడా సహకరించదు. కాళ్లు,చేతులు కదపలేరు. వీరు తినాలన్నా పడుకోవాలన్న ఒకరి సహాయం లేనిదే కుదరదు. సొంతంగా ఏ పనీ కూడా చేసుకోలేరు కనీసం చీమకుడుతున్నా సరే తీయలేని నిస్సహాయ స్థితిలో వీరు ఉంటారు. చివరికి సొంతంగా వీరు మలమూత్ర విసర్జన కూడా చేయలేరు. నారాయణపురం మండల పరిధిలోని లింగవారిగూడం గ్రామానికి చెందిన కత్తుల బాలకృష్ణ అనే వ్యాధిగ్రస్తుడు బతుకు ఇవ్వండి లేదా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన పంచుకున్నాడంటే ఈ వ్యాధి తీవ్రతను మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

వీటికి తోడు దీర్ఘకాలిక వ్యాధులు..

కండర క్షీణత వ్యాధిగ్రస్తులు ఒకే దగ్గర కూర్చుని కదలలేని స్థితిలో ఉండడంతో దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. బీపీ,షుగర్, శ్వాస సంబంధిత వ్యాధులు కూడా వీరికి వస్తున్నాయి. ఈ వ్యాధికి సరైన చికిత్స లేకపోవడంతో వారి బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. అసలు కండరాల క్షీణత వ్యాధికి గల కారణాలు ఏంటో ఇప్పటికీ వైద్యులకు అంతుచిక్కడం లేదు. కొందరు వైద్యులు జన్యుసంబంధమైన లోపం అని, మరికొందరు పోషకాహారం లోపం వలన అంటూ వైద్యులే సరైన నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇప్పటికీ ఈ వ్యాధిపై వైద్యుల పరిశోధన కొనసాగుతూనే ఉంది.

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు.

రాష్ట్రంలో సుమారు 3500 మందికి పైగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు సమాచారం. ఒక్క చౌటుప్పల్ డివిజన్ పరిధిలోనే దాదాపు కండర క్షీణత వ్యాధిగ్రస్తులు సుమారు 20 మందికిపైగా ఉంటారు. చికిత్స కోసం వీరంతా ఎన్నో ఆస్పత్రులు తిరిగినా నయం కాకపోగా లక్షల రూపాయలు వెచ్చించి అలసిపోయారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వీరికి ప్రభుత్వం ఇచ్చే నెల నెలా పెన్షన్ రూ.3016 దేనికి సరిపోవడం లేదని వాపోతున్నారు. వీరిని ప్రత్యేక వ్యాధిగ్రస్తులుగా గుర్తించి పెన్షన్ పెంపుదల లేదా సహాయకుడి అలవెన్సులు ఇవ్వాలని కోరుతున్నారు. అంతే కాకుండా ఈ వ్యాధితో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నందున హెల్త్ కార్డులు కూడా ఇప్పించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ప్రగతి భవన్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు..

చిన్ననాటి నుండి కండరాల క్షీణిత వ్యాధితో బాధపడుతున్నాను.తమ తల్లిదండ్రులు స్తోమతకు మించి ఖర్చు చేసి ఆసుపత్రిలో చుట్టూ తిప్పారు. మెరుగైన వైద్యం చేయించాలంటే లక్షలు కావాలి అని అన్నారు. ఇంకా డబ్బు తేవడం తమ వల్ల కాదని తల్లిదండ్రులు చేతులెత్తేయడంతో వ్యయప్రయాసలు పడి సీఎం అపాయింట్ మెంట్ కోసం నేను హైదరాబాద్ వెళ్లాను. ఇలా అయినా తమ గోడు కేసీఆర్ కు చేరుతుందని ఆశించాను. కానీ ప్రగతి భవన్ సెక్యూరిటీ సిబ్బంది సీఎంను కలిసేందుకు అనుమతించకుండా అడ్డుకున్నారు.గతంలో ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసిన స్పందించలేదు.
– కత్తుల బాలకృష్ణ, తెలంగాణ మస్క్యూలర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ అధ్యక్షుడు, లింగవారిగూడం



Next Story

Most Viewed