మహిళను వివస్త్రను చేసి దాడి.. హెచ్ఆర్సీ సీరియస్

by  |
మహిళను వివస్త్రను చేసి దాడి.. హెచ్ఆర్సీ సీరియస్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: హత్య కేసులో నిందితురాలుగా ఉన్న మహిళపై మృతుడి బంధువులు కళ్లలో కారం చల్లి, వివస్త్రను చేసి అందరి ముందు కర్రలతో దాడి చేసిన సంఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ మేరకు సోమవారం దిశ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని హెచ్ఆర్సీ సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించింది. సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాకు చెందిన శంకర్ నాయక్ ఈ నెల 13వ తేదీన హత్యకు గురయ్యాడు. ఈ ఊరికే చెందిన బాధిత మహిళ హత్య కేసులో నిందితురాలుగా అరెస్ట్ అయ్యి బెయిల్ పై విడుదలైంది. తన సోదరి ఇంట్లో ఉంటున్న ఆమె బంధువు ఒకరు మృతి చెందడంతో రాజునాయక్ తండాకు వెళ్లింది.

శంకర్ నాయక్ హత్యానంతరం మొదటి సారిగా తండాకు వచ్చిన ఆమెను చూసిన మృతుని బంధువులు ఆమెను ఇంట్లోంచి బయటకు లాక్కుని వచ్చి కళ్లలో కారం కొట్టి, కర్రలతో కొడుతూ నగ్నంగా గ్రామంలో సుమారు గంట పాటు తిప్పారు. ఈ వార్తను దిశ దినపత్రికలో ప్రచురించడంతో హెచ్ఆర్సీ స్పందించి కమిషన్ డీఎస్పీ శుభాష్ బాబు ద్వారా సూర్యాపేట డీఎస్పీని ఆరాతీశారు. మహిళపై దాడి చేసిన 10మందిపై కేసులు నమోదు చేశామని, ఐదుగురిని అరెస్ట్ చేశామని డీఎస్పీ హెచ్ఆర్సీకి నివేదించారు. ఈ సంఘటనపై మరింత లోతుగా విచారణ జరిపి బాధిత మహిళకు న్యాయం చేసి వీలైనంత త్వరగా హెచ్ఆర్సీకి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.



Next Story

Most Viewed