ఆ రాష్ట్రాల మధ్య రాకపోకలను సమన్వయం చేయండి: సుప్రీం

by  |
ఆ రాష్ట్రాల మధ్య రాకపోకలను సమన్వయం చేయండి: సుప్రీం
X

న్యూఢిల్లీ: ఢిల్లీ, యూపీ, హర్యానాల మధ్య ప్రయాణాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లకు పొరుగురాష్ట్రాలకు మధ్య రాకపోకలపై తలెత్తిన గందరగోళాన్ని తొలగించాలని, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల మధ్య సమన్వయాన్ని తీసుకురావాలని తెలిపింది. ఆ మూడు రాష్ట్రాల అధికారులను సమావేశపరిచి సంయుక్త ప్రయాణ ప్రణాళికను సిద్ధం చేయాలని, వారంలోపు ఈ పని పూర్తవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిర్ణయాన్ని కేంద్ర సర్కారు రాష్ట్రాలకే వదిలిపెట్టింది. దీంతో కొన్ని రాష్ట్రాలు పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలకు అనుమతించగా.. మరికొన్ని రాష్ట్రాలు ఆంక్షలను అలాగే కొనసాగించాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఒకవారం రోజులపాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాణికులను అనుమతించబోమని నిర్ణయించింది. కాగా, అదే రోజు హర్యానా మాత్రం ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలపై అనుమతినిచ్చింది. హర్యానా ప్రభుత్వం ఇచ్చిన ఈ-పాస్‌లు ఉన్నప్పటికీ ఢిల్లీలోకి అనుమతించకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. అలాగే, ఢిల్లీ సమీపంలోని నోయిడాకు రాకపోకలపైనా ఆంక్షలు అమలవుతున్నాయి. నోయిడాకు యూపీ నుంచి ప్రయాణికుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ, హర్యానా, యూపీల మధ్య సంయుక్త ప్రణాళికను రూపొందించి ప్రయాణికుల అసౌకర్యాన్ని దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.



Next Story

Most Viewed