వారికి మళ్లీ నిరాశేనా.? ఇది టైం కాదంటున్న గులాబీ సీనియర్లు

by  |
వారికి మళ్లీ నిరాశేనా.? ఇది టైం కాదంటున్న గులాబీ సీనియర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : అధికార పార్టీ నేతలకు పదవుల గండం నెలకొంది. ఏండ్ల నుంచి పార్టీ పదవుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. నామినేటేడ్​పోస్టులు రాక, గ్రామ, మండల, పురపాలికల్లో ప్రజాప్రతినిధులయ్యే ఛాన్స్​ లేక పార్టీ పదవులపై ఆశలు పెట్టుకున్న వారంతా మళ్లీ నిరాశకు గురవుతున్నారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా అధికార టీఆర్ఎస్ పార్టీకి జిల్లా, పట్టణ, మండలాలకు అధ్యక్షులను నియమించడం లేదు. కేవలం ఇన్‌చార్జులతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఈ నెల 27న జరిగే పార్టీ ఫ్లీనరీపై ఆశలు పెట్టుకున్న నేతలంతా అదే వేదికగా విన్నవించుకోవాలని ఆశపడ్డారు. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫ్లీనరీని రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రకటించడంతో నేతలు ఆందోళన చెందుతున్నారు.

దీనికి తోడు కరోనా సాకుతో పార్టీ సీనియర్ నేతలు కేడర్‌ను కలిసేందుకు కూడా సమయం ఇవ్వడం లేదు.
తెలంగాణ రాష్ట్రఆవిర్భావం తర్వాత ప్రభుత్వం పరిపాలనా సంస్కరణల దిశగా ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం-1974 ప్రకారం 10 ఉమ్మడి జిల్లాలకు కొత్తగా మరో 23 జిల్లాలను ఏర్పాటు చేయడంతో మొత్తం 33 జిల్లాలకు చేరింది. కానీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులే ఒకటి రెండేళ్లు ఇన్‌చార్జులుగా పనిచేశారు. 2016 అక్టోబర్‌లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినా పార్టీకి మాత్రం అధ్యక్షులను నియమించలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులకు బాధ్యతలను ఇచ్చి నెట్టుకొస్తున్నారు.

ఉదాహరణగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 2014 నుంచి 2016 బండా నరేందర్ రెడ్డి అధ్యక్షుడిగా పనిచేశారు. 2016 తర్వాత తెలంగాణ ఫారెస్టు డెవలప్ మెంట్ చైర్మన్ (టీఎస్ ఎఫ్‌డీసీ) చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయినా ఆయనకే పార్టీ బాధ్యతలను కూడా అప్పగించారు. ప్రస్తుతం నల్లగొండ జడ్పీచైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు పదవులు ఒకరికేనా? అనే చర్చ పార్టీలో జరుగడంతో పాటు పలువురు నేతలు అధ్యక్ష పదవి వరిస్తుందని ముఖ్య నేతలతో సంప్రదింపులు కూడా చేశారు. కానీ పార్టీ అధిష్టానం ఎవరికీ పార్టీ బాధ్యతలు అప్పగించలేదు. బండా నరేందర్ రెడ్డినే ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మరో రెండు కొత్త జిల్లాలు యాదాద్రిభువనగిరి, సూర్యాపేట ఏర్పడ్డాయి. వాటికి కూడా పార్టీ అధ్యక్షులను నియమించలేదు. వాటికి బండానే ఇన్‌చార్జి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇలా తెలంగాణలోని 33 జిల్లాలకు గత ఉమ్మడి జిల్లాలకు నియమించిన ఇన్‌చార్జులే పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు.

ఫ్లీనరీపై ఆశలు..

వరుసగా 2019లో లోక్‌సభ ఎన్నికలు, 2020లో కరోనాతో ఫ్లీనరీని వాయిదా వేశారు. 2021లో కరోనా నేపథ్యంలో ఈనెల 27న జరిగే ఫ్లీనరీని వాయిదా వేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. అయితే ఫ్లీనరీ వేదికగా పార్టీ పదవి ఇవ్వాలని, సభ్యత్వం ఎక్కువగా చేసిన నేతలకు పదవులు వస్తాయని ప్రగతిభవన్​ వేదికగా పార్టీ బాస్ కేసీఆర్​ప్రకటించడంతో నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఉద్యమకాలం నుంచి జెండా మోస్తున్న వారికి పదవులు వస్తాయని ఆశించారు. ప్లీనరీ వేదికగా అధిష్టానానికి విన్నవించుకునేందుకు నేతలు సంసిద్ధమయ్యారు. పట్టణ, మండల, జిల్లా స్థాయి నేతలు కూడా ఇందుకు సిద్ధమయ్యారు. కానీ ఫ్లీనరీ రద్దు చేశారు. దీంతో ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా పోతోంది. ఎండ్ల నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న నేతలకు మరోసారి మొండి చేయి చూపినట్లే అయింది.

సమయం లేదు మిత్రమా..!

ఇక పార్టీ పదవులను ఆశిస్తున్న నేతలకు కరోనా సాకుతో సీనియర్లు సమయమివ్వడం లేదు. తాము పార్టీలో చేస్తున్న కార్యక్రమాలు, ఉన్న ఆదరణ, చేపడుతున్న కార్యక్రమాలను విన్నవించుకుందామని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడే వద్దంటూ వాయిదా వేస్తున్నారు. అటు పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ను కలువాలంటే సాధ్యమయ్యే పరిస్థితే లేదు. ఈ పరిణామాల్లో పార్టీ పదవులు వస్తాయా.. రావా అనే ఎదురుచూపుల్లోనే వారు ఉంటున్నారు.

Next Story

Most Viewed