బిగ్ బ్రేకింగ్.. టీఆర్ఎస్ ఎంపీకి షాకిచ్చిన ఈడీ

by  |
బిగ్ బ్రేకింగ్.. టీఆర్ఎస్ ఎంపీకి షాకిచ్చిన ఈడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మళ్ళించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరుకావాలని హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయం ఆ సమన్లలో స్పష్టం చేసింది. ఆయనతో పాటు మధుకాన్ కంపెనీకి చెందిన డైరెక్టర్లకు కూడా సమన్లు జారీ చేసింది. ఒక జాతీయ రహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారనేది నామా నాగేశ్వరావుతో పాటు మధుకాన్ కంపెనీ డైరెక్టర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభియోగాలను నమోదు చేసింది.

బ్యాంకు రుణాలను మళ్ళించినట్లు ఆరోపణలు వచ్చిన తర్వాత ఇటీవల హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు మధుకాన్ నిర్మాణ సంస్థకు చెందిన డైరెక్టర్ల నివాసాల్లోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన అధికారులు రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. నగదుతో పాటు పలు డాక్యుమెంట్లు, ఫైళ్ళు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్‌తో పాటు అందులోని హార్డ్ డిస్కులను కూడా వెంట తీసుకెళ్ళారు. ఇది జరిగిన వారం రోజులకే ఈడీ నుంచి సమన్లు జారీ కావడం విశేషం. నామా నాగేశ్వరరావుతో పాటు మధుకాన్ కంపెనీకి చెందిన డైరెక్టర్లు కూడా ఈ నెల 25న ఈడీ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది.


Next Story

Most Viewed