డైరెక్టర్ గా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న పూరి

by  |
డైరెక్టర్ గా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న పూరి
X

దిశ వెబ్ డెస్క్ : ఆయన సినిమాల్లో ఒక్కసారైన హీరోగా చేయాలని ప్రతి హీరో కోరుకుంటాడు. అప్పటివరకు హీరోకు ఉన్న ఇమేజ్ వేరు.. ఆయన సినిమాల్లో హీరోగా చేశాక వేరు. తెరపై హీరోను ఎలా ప్రజెంట్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన సినిమాల్లో చాన్స్ వస్తే.. హీరోలు వదులుకోరు. డైలాగుల్లో పదును.. హీరోలో పొగరు.. కథనంలో దూకుడు.. కథలో కొత్తదనం.. ఇదే ఆయన నమ్మిన సూత్రం. విజయాలు ఎదురైనా.. అపజయాలు పలకరించినా.. ఒకటే నైజం. సినిమానే ఆయన లోకం. ఆయనే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. తొలి సినిమా బద్రితోనే ఆయనేంటో నిరూపించుకున్న ఈ డైరెక్టర్. ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అడుగుపెట్టి ఏప్రిల్ 20తో… 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

తెలుగులోని అగ్రదర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన పూరి.. తొలి చిత్రంగా పవన్ కల్యాణ్ హీరోగా బద్రిని తెరకెక్కించాడు. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ చిత్రంలోని డైలాగ్ లు పవర్ స్టార్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతాయి. ఏప్రిల్ 20 న విడుదలైన ఆ చిత్రం నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. దర్శకుడిగా పూరి ప్రయాణం ప్రారంభించి కూడా సరిగ్గా రెండు దశాబ్దాలు పూర్తయింది. ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లతో వరుస హిట్లు సాధించాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో తీసిన ‘పోకిరి’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో.. అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఈ 20 ఏల్ల కెరీర్లో హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లతో పాటు ప్లాప్ లు చవిచూశాడు. ఇక పూరి పనైపోయిందని అనుకున్నా ప్రతి సారి ఓ హిట్ అందించి విమర్మకులకు సమాధానమిచ్చాడు. తన ఆరాధ్య నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాతో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో అమితాబ్ ను సరికొత్తగా చూపించాడు. ఇక మొత్తంగా నాగార్జున, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ ఇలా అందరూ అగ్రహీరోలతో సినిమా చేసిన పూరి. ఇప్పటివరకు చిరంజీవి, వెంకటేష్ లతో మాత్రం సినిమా తీయలేదు. కొన్ని చర్చలు జరిగినా.. ఆ సినిమాలు పట్టాలెక్కలేదు. మరి రాబోయే కాలంలో వీరితో సినిమాలు తీస్తాడేమో వేచి చూడాలి. 20 ఏళ్లలో పూరి మొత్తంగా 35 చిత్రాలు చేశాడు. సినిమా ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్, సినీ నటి చార్మీలు పూరి జగన్నాథ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్ ’ అనే సినిమా చేస్తున్నాడు.

Tags : puri jagannath, director,badri, tollywood, telugu cinema,

Next Story

Most Viewed