‘వారంలో రెండ్రోజులు చేనేత దుస్తులు ధరిద్దాం’

by  |
Director N. Balaram
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: మన దేశానికే గర్వకారణమైన అద్భుత చేనేత కళా వారసత్వాన్ని ముందు తరాల వారికి అందించడానికి, కోట్లాది చేనేత కార్మిక కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతిఒక్కరూ వారంలో కనీసం రెండ్రోజులు చేనేత దుస్తులు ధరించాలని డైరెక్టర్‌(ఫైనాన్స్‌, పర్సనల్‌, పీఅండ్‌‌పీ) ఎన్‌.బలరామ్‌ అన్నారు. హైదరాబాద్‌‌లోని సింగరేణి భవన్‌‌లో శనివారం ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో మహాత్మాగాంధీ స్వదేశీ వస్తువులు వాడాలి, విదేశీ వస్తువులను బహిష్కరించాలన్న ఉద్యమంలో కూడా చేనేత వస్త్రాలకు ప్రాధాన్యతనిచ్చారని స్వయంగా నూలు వడుకుతూ స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. దేశవ్యాప్త చేనేత కార్మికులకు చేయూతనందించాలన్న ఉద్దేశంతో 2015 ఆగస్టు 7వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారని తెలిపారు.

ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా చేనేత కళకు ప్రాధాన్యతనివ్వడం సంతోషకరమన్నారు. కనీసం ప్రతీ ఉద్యోగి వారంలో రెండు రోజులు చేనేత దుస్తులు ధరించడం ద్వారా చేనేత కార్మికుల అభివృద్ధికి తోడ్పడవచ్చని అన్నారు. జీఎం(కోఆర్డినేషన్‌, మార్కెటింగ్‌) కె.సూర్యనారాయణ మాట్లాడుతూ చేనేత దుస్తులు మిగిలిన సింథటిక్‌ దుస్తుల కన్నా ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని, ఉద్యోగులు వీటిని వాడటం వల్ల చేనేత పరిశ్రమకు చేయూత నివ్వడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండవచ్చని పేర్కొన్నారు. గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగులు, అధికారులు చేనేత దుస్తులు ధరించడం ద్వారా వారిని కాపాడినవారు అవుతారని, ప్రతీ ఒక్కరూ చేనేత దుస్తులు ధరించాలని కోరారు. అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్వీ రాజశేఖర్‌ రావు మాట్లాడుతూ.. భారత చేనేత వస్త్ర కళాకారుల నైపుణ్యం ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకున్నదని, అటువంటి వారసత్వాన్ని కొనసాగించాలంటే అందరూ చేనేత దుస్తుల వినియోగం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం(పర్సనల్‌) ఆర్సీ, ఐఆర్‌, పీఎంఏ. ఆనందరావు, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, నాయకులు కెంగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed