ఇంకా.. రూ. 360 కోట్లకు పైగా చెల్లించాలి!

by  |
ఇంకా.. రూ. 360 కోట్లకు పైగా చెల్లించాలి!
X

ఉమ్మడి నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాల ప్రజలకు కృష్ణా జలాలు అందించే ఉద్దేశంతో చేపట్టిన డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆదిలోనే బ్రేక్ పడింది. సీఎం కేసీఆర్ 2015 జూన్ 12న దీనికి శంకుస్థాపన చేశారు. ఐదేండ్లు పూర్తవుతున్నా నేటికీ అతీగతీ లేదు. కనీసం భూసేకరణ కూడా కంప్లీట్ కాలేదు. మరో వైపు పరిహారం అందలేదని నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు. ప్రతిసారి రీడిజైన్ల పేరిట మార్పులు చేర్పులతో కాలం వెళ్లదీస్తున్నారు. మూడున్నరేండ్లలో బాహుబలిగా చెప్పుకునే కాళేశ్వరం పూర్తయిందిగానీ, ఈ ప్రాజెక్టు పనుల్లో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. మరో వైపు ఫ్లోరైడ్ రక్కసితో బాధ పడుతున్నతమకు చుక్క నీరూ అందడం లేదని జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, న్యూస్ బ్యూరో :

ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని కరవు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు, 3.10 లక్షల ఎకరాలకు కృష్ణా జలాలను తరలించే ఉద్దేశంతో సర్కారు డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.6,190 కోట్ల వ్యయంతో దీనికి ప్రతిపాదనలు రూపొందించారు. సీఎం కేసీఆర్ 2015 జూన్ 12న మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం శివన్నగూడెం (చర్లగూడెం) చెరువు వద్ద ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రాజెక్టును రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని, నిర్వాసితులకు పదింతల పరిహారం, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్‌రూమ్, అవసరమైతే భూమికి భూమి ఇస్తామంటూ హామీలు గుప్పించారు. ఐదేండ్లవుతున్నా ఏ ఒక్క హామీ అమలు కాలేదు. ఎకరాకు రూ.8 నుంచి రూ.10 లక్షల మేర పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పినా అధికారులు మాత్రం రూ.5.15 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారంటూ డిండి నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. దీనిపై గతేడాది రిటైర్డ్ ఇంజినీర్ల బృందం ఎదుట ఆందోళన చేశారు.

భూసేకరణలో జాప్యం

మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలో సింగరాయపల్లి, చింతపల్లి, గొట్టిముక్కల, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లు, కాలువల నిర్మాణ పనులను రూ.4,637 కోట్ల వ్యయంతో చేపట్టారు. వీటికి సంబంధించి 16 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి వుంది. ప్రభుత్వ, అటవీ భూములు పోనూ 13,094.71 ఎకరాల మేరకు భూసేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటిదాకా 2657.55 ఎకరాలే భూమిని సేకరించారు. ఇప్పటి దాకా కేవలం రూ.108.03 కోట్ల మేరకు మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.360 కోట్ల పైనే చెల్లించాల్సి వుంది.

డిజైన్లలోనే ఏండ్లు..

డిండి ఎత్తిపోతల పథకం డిజైన్లు తరచూ మారుతున్నాయి. రీడిజైన్ల పేరిట కాలం గడుపుతున్నారు. భూసేకరణ పరిహారం, పునరావాసంపై స్పష్టమైన హామీలు అందాకే పనులు ప్రారంభించాలంటూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. డిండి ప్రాజెక్టు పనుల పురోగతికి ఇదే ఆటంకంగా మారింది. మరోవైపు డిండి ఎత్తిపోతలకు ఎక్కడి నుంచి నీటిని తరలించాలనే అంశంలో అధికారుల స్థాయిలో ఇంకా స్పష్టత లేదు.

రాచకొండకు బ్రేక్

డిండి ప్రాజెక్టు నుంచి శివన్నగూడెం రిజర్వాయర్‌కు నీటిని తరలించి అటు నుంచి రాచకొండ ఎత్తిపోతలతో 0.10 టీఎంసీల నీటిని సాగు అవసరాలకు వినియోగించుకునేలా ఈస్కీ (ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా) ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రాచకొండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు డిజైన్‌ కొలిక్కి రాకపోవడంతో ఈ పథకం ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టంగానే కనిపిస్తోంది.

Next Story