ధాన్యం విక్రయాలు.. ఫలి ‘తాలు’ ఇవీ!

by  |
ధాన్యం విక్రయాలు.. ఫలి ‘తాలు’ ఇవీ!
X

దిశ, కరీంనగర్: ఆరుగాలం శ్రమించి అన్నదాత పండించిన పంటలోని ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందని ప్రభుత్వం చెబుతున్నది. అందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ, తాలు పేరిట మిల్లర్ల నుంచి రైతులకు ఇబ్బందులెదురవుతున్నాయి. తాలుపై మంత్రులూ భిన్న కామెంట్లు
చేస్తున్నారు. తాలు పేరిట అడ్డగోలుగా తరుగు తీయడం సరైన పద్ధతి కాదనీ, మిల్లర్ల వైఖరిలో మార్పు రావాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మిల్లర్ల వైఖరిలో మార్పు లేనట్టయితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందనీ హెచ్చరించారు. మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దని మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఇతర జిల్లాలకు చెందిన మంత్రులు కూడా తాలు పేరిట తరుగు అడ్డగోలుగా
తీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. కానీ, మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ,తెగులు సోకడం వల్లె తాలు ఎక్కువగా వస్తోందనీ, హార్వెస్టర్ బ్లోయర్‌కు కూడా తాలు పోవడం లేదంటూ మిల్లర్ల వాదనలోనూ వాస్తవం ఉందన్నట్టు చెబుతున్నారు. దీంతో ధాన్యం అమ్మే రైతులు గందరగోళానికి గురవుతున్నారు.

ఎమ్మెల్యే దుదిళ్ల లేఖ…

ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్చేజింగ్ సెంటర్ల ద్వారా సేకరించిన ధాన్యం మిల్లర్లకు పంపిస్తే వారు క్వింటాలుకు 67 కిలోల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మిల్లర్లు క్వింటాలు ధాన్యానికి 5 నుంచి 8 కిలోల తరుగు తీస్తున్నారని గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పని చేసిన మంథని ఎమ్మెల్యే దుదిళ్ల శ్రీధర్ బాబు ఆరోపిస్తున్నారు. రైతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రులకు లేఖలు రాశారు.

శాసిస్తున్న మిల్లర్లు!

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభిస్తే మిల్లర్లు శాసిస్తున్నారేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వరి కోత నుంచి మొదలు రైతు చేతికి చెక్కు వచ్చే వరకు కూడా ఇబ్బందులెదురవుతున్నాయి రైతాంగానికి. కరోనా పుణ్యమా అని టోకెన్ సిస్టంతో ధాన్యం కోత కోయాలి, మాయిశ్చర్ తగ్గించేందుకు అధికారులు చెప్పినన్ని రోజులు ఎండబెట్టాలి. వారు చెప్పిన రోజునే కొనుగోలు కేంద్రానికి తరలించాలి. అక్కడా తేమ శాతం చూసిన తర్వాతే కొనుగోలు చేస్తారు. చివరకు మిల్లర్లు చెప్పినట్టుగానే తరుగు తీయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. తాలు, తరుగు వ్యవహారంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని పుల్ స్టాప్ పెడితే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

Tags: crop buying centres, ministers, visit, different comments, moisture, farmers

Next Story