ఏ విధానం.. ఎవరికి లాభం?

by  |
ఏ విధానం.. ఎవరికి లాభం?
X

చ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయపు పన్నులో కొత్త శ్లాబ్ విధానం ప్రకటించింది. పాత శ్లాబ్ విధానమూ కొనసాగించింది. రెండింటిలో ఏదైనా ఒకటి ఎంచుకొనే స్వేచ్ఛ పన్ను చెల్లింపుదారుడికే వదిలేసింది. ఈ నేపథ్యంలో పాత, కొత్త విధానంలో తేడా, ఎవరికి లాభమో తెలుసుకుందాం.

గత శ్లాబ్ విధానం

గతంలో రూ. 2.50 లక్షల వరకు పూర్తి పన్ను మినహాయింపు ఉంది. రూ. 2.50 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, గరిష్ఠంగా రూ. 12,500 రిబేట్ ప్రకటించడంతో ఒక రకంగా రూ. 5 లక్షల వరకు పన్ను లేనట్లే లెక్క. ఆ తర్వాత రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 20 శాతం పన్ను, రూ. 10 లక్షలు దాటితే 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది.

కొత్త శ్లాబ్ విధానం

ఏడు శ్లాబ్‌లతో కొత్త ఆదాయపు పన్ను చెల్లింపు విధానం ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరం లాగానే రూ. 2.50 లక్షల వరకు పూర్తి పన్ను మినహాయింపును కొనసాగించారు. రూ. 2.50 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం, రూ. 5 లక్షల నుంచి రూ. 7.50 లక్షల వరకు 10 శాతం, రూ. 7.50 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 15 శాతం, రూ. 10 లక్షల నుంచి రూ. 12.50 లక్షల వరకు 20 శాతం, రూ. 12.50 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు 25 శాతం, రూ. 15 లక్షలకుపైనా 30 శాతం పన్నుగా నిర్ణయించారు.

రెండింటి మధ్య తేడా

పాత విధానానికి ఆదాయపు పన్ను చట్టం అన్ని మినహాయింపులు వర్తిస్తాయి. గతంలో 100కు పైగా ఉన్న పన్ను మినహాయింపులను ఈసారి 30కి కుదించారు. కొత్త విధానం ప్రకారమైతే ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఏ శ్లాబ్ కిందకి వస్తే అంత శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కసారి ఒక్క విధానం ఎంచుకున్న తర్వాత మళ్లీ మరో దానిలోకి మారడానికి అవకాశం ఉండదు. వచ్చే ఆదాయం, ఖర్చు, పొదుపుల ఆధారంగా పాత లేదా కొత్త విధానాన్ని ఎంచుకోవచ్చు.

ఎంత పన్నంటే…

ఓ ఉద్యోగి వేతనం రూ. 7,50,000 ఉందనుకుంటే పాత విధానం ప్రకారం రూ. 1,80,300ల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. మిగిలిన రూ. 5,69,700లకు 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం రూ. 24,089తోపాటు విద్యా సెస్సు కింద రూ. 964లు కలిపి రూ. 25,153ల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే కొత్త విధానం ప్రకారమైతే ఎలాంటి మినహాయింపు ఉండదు. కాబట్టి రూ. 7,50,000ల వరకు రూ. 37,500 పన్నుతోపాటు విద్యా సెస్సు కింద రూ. 1,500 కలిపి మొత్తం రూ. 39,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

మినహాయింపులు ఉంటే..

పై లెక్కల ప్రకారం ఇప్పటికే గృహరుణాలు, రూ. లక్షల్లో స్కూల్, ట్యూషన్ ఫీజులు, జీవిత బీమా, ఇతర చెల్లింపులు ఉన్న వారైతే పాత విధానం ఎంచుకోవడమే మేలు. ఎందుకంటే, పాత విధానం ప్రకారం అన్ని మినహాయింపులు పోగా రూ. 25,153 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త విధానం ప్రకారమైతే రూ. 39,000 చెల్లించాలి. అంటే.. మినహాయింపులు గలవారు కొత్త విధానం కంటే పాత విధానంలో పన్ను చెల్లిస్తే రూ. 14,000 వరకు లబ్ధి పొందవచ్చు. గృహరుణాల వడ్డీ, స్కూల్, ట్యూషన్ ఫీజులు, జీవిత బీమా వంటివి లేనివారికి కొత్త విధానమే మేలుగా ఉంటుందని ట్యాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story