కరోనాను జయించిన కిడ్నీ పేషెంట్.. కానీ

by  |
కరోనాను జయించిన కిడ్నీ పేషెంట్.. కానీ
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. కరోనా బారినపడి కోలుకున్న ఓ కిడ్నీ పేషెంట్‌ను కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. జిల్లాలోని తుర్కపల్లి మండలం మాదాపూర్‌కు చెందిన వ్యక్తి ఏడేళ్ల కిందట కిడ్నీలు చెడిపోవడంతో.. అప్పట్నుంచి ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు.

ఇదే క్రమంలో డయాలిసిస్ చేయించుకోవడానికి వెళ్లగా.. అదే ఆస్పత్రికి వచ్చిన మరో కిడ్నీపేషెంట్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ రోజు డయాలిసిస్ చేయించుకున్న వారందరికీ కరోనా టెస్టులు చేయగా.. ఇతడికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో గాంధీ ఆస్పత్రిలో చేరిన అతడు 16 రోజుల చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి వెళ్లాడు.

తిరిగి మళ్లీ డయాలసిస్ చేయించుకోవడం కోసం తాను గతంలో వెళ్లిన ఆస్పత్రికి వెళ్లగా.. ఇప్పుడు డయాలసిస్ చేయడం కుదరదు. మరో ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. వేరే ఆస్పత్రికి వెళితే.. అక్కడా కుదరదని చెప్పారు. చివరకు దగ్గర్లోని ఆలేరు ఆస్పత్రికి వెళ్లగా.. కరోనా నుంచి కోలుకున్నా 14 రోజులు క్వారంటైన్లో ఉండాలి. కావున క్వారంటైన్ గడువు ముగిశాక రావాలని సూచించారు. దీంతో బాధితుడు ఆందోళనకు గురవుతున్నాడు. మూడు రోజులకోసారి డయాలిసిస్ చేయించుకోవాల్సి రావడం.. మరోవైపు ఆస్పత్రులు తిప్పి పంపుతుండటంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.



Next Story

Most Viewed