మా ఉద్యోగాలు మాకివ్వండి

by  |
మా ఉద్యోగాలు మాకివ్వండి
X

దిశ, క్రైమ్‌బ్యూరో: 2018‌లో కానిస్టేబుళ్లుగా నియామకమైన వారిని శిక్షణకు అనుమతివ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. మంగళవారం డీజీపీ కార్యాలయం ఎదుట దాదాపు 400 మంది అభ్యర్థులు ప్లకార్డులు చేత పట్టుకుని నిరసన వ్యక్తం చేసి అనంతరం రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులను కలిశారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ 2018 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లోని 16వేల పోస్టుల్లో ఈవెంట్స్, మెయిన్ ఎగ్జామ్, మెడికల్ టెస్ట్‌లలో అర్హత పొందిన వారిలో పోలీస్ వెరిఫికేషన్‌లో గతంలో అభ్యర్థులపై నమోదైన కేసులు తదితర కారణాల రీత్యా సుమారు 1300 మందికి బోర్డు నుంచి షోకాజ్ నోటీసులు అందాయన్నారు. ఈ నోటీసులకు తిరిగి సమాధానం చెప్పిన అభ్యర్థులకు బోర్డు నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు.

అయితే, 2018 నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్ గా నియామకమై, ఎంక్వైరీ పూర్తయిన అభ్యర్థులు ఇప్పటికే 7నెలలుగా శిక్షణ పొందుతున్నట్టు తెలిపారు. ఇదే సమస్యను వరంగల్, మెదక్ జిల్లాల్లో అధికారులు క్లియర్ చేయడమే కాకుండా, అక్టోబర్ లేదా నవంబరు లో రెండో విడత శిక్షణకు పంపిస్తామని ఉత్తర్వులు అందజేసినట్టుగానే మిగతా జిల్లాల అభ్యర్థులకు కూడా శిక్షణకు సంబంధించిన ఆర్డర్ కాపీలను ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై రిక్రూట్మెంట్ బోర్డు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ స్పందిస్తూ మీ సమస్యను నెలరోజుల్లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.


Next Story