ధారావికి కరోనా.. ఆందోళన

by  |
ధారావికి కరోనా.. ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో స్లమ్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ధారావి. అది ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ. 5 కిలోమీటర్ల పరిధిలోనే సుమారు పది లక్షల మంది అక్కడ జీవిస్తున్నారు. అగ్గిపెట్టె లాంటి ఇండ్లు. ఇంటింటికి మధ్యలో ఒక గోడ లేదా రేకులు మాత్రమే అడ్డం. ఇరుకిరుకుగా తక్కువ స్థలంలోనే ఎక్కువ మంది కలిసి ఉంటారు. అడుగు తీసి బయట పెడితే మరో ఇంటిలో అడుగు పెట్టినట్టే ఉంటుంది. అటువంటి చోటికి కరోనా వైరస్ చేరితే వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది.

ధారావిలో 24గంటల్లోనే రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. రాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేష్ తోపే ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేశారు. జనసమ్మర్ధంగా ఉండే ఇలాంటి చోట వైరస్ వెలుగు చూడడం నిజంగా ఆందోళనకరమే. అయితే అటువంటి చోట కరోనాకు కళ్లెం వేసేందుకు మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తామని, పాజిటివ్ కేసులన్నింటినీ గుర్తిస్తామని చెప్పారు.

ధారవిలో గార్మెంట్ షాప్ యజమాని (56) వారం క్రితం కరోనా లక్షణాలు కనిపించాయి. గత నెల 29న సియాన్ ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. కాగా, బుధవారం అతనికి కరోనా పాజిటివ్ గా తేలింది. గురువారం ప్రాణాలు వదిలారు. అతని షాప్ ఉన్న బిల్డింగ్ లో 300 ఫ్లాట్లు ఉన్నాయి. 90 ఇతర షాపులు ఉన్నాయి. అధికారులు వాటన్నిటి మూసేశారు. అతనితో కాంటాక్ట్ లో ఉన్న వారందరినీ గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

335 కరోనా కేసులతో దేశంలోనే అధిక ప్రభావిత రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది. అయితే అందుకు తగినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నది. తాజాగా ధారావికి వైరస్ సోకడం పైనా సర్కారు వెంటనే అప్రమత్తమైంది.

Tags : Coronavirus, dharavi, maharashtra, cases, slum, spread

Next Story

Most Viewed