మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు : డీజీపీ

by  |
మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు : డీజీపీ
X

దిశ, ములుగు: మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులని, మళ్లీ తెలంగాణలో ప్రవేశించి హింసాత్మక చర్యలకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఏటూరు నాగారం సబ్ డివిజన్‌లోని వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో ములుగు, భూపాలపల్లికి చెందిన పోలీస్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టు ఆగడాలను తెలంగాణ గడ్డ మీద జరగనివ్వబోదన్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు హరి భూషణ్, దామోదర్ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అమాయక గిరిజనులను బలిపశువులుగా చేస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టులకు ఎవరూ కూడా సహకరించకూడదని హెచ్చరించారు. తెలంగాణలో ఉండే డాక్టర్లు, ఇంజినీర్లు, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథక రచనతో తిరిగి మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టాలని మావోయిస్టులు చేసే ప్రయత్నాలను తెలంగాణ పోలీస్ శాఖ సమర్థవంతంగా తిప్పి కొడుతుందన్నారు. పదేండ్ల క్రితం తెలంగాణ ప్రజల కోపాగ్నికి గురై ఇక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోయిన మావోయిస్టులు తిరిగి మళ్ళీ తెలంగాణ ప్రజల కోపానికి గురి కాకూడదని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం రహదారులతో అనుసంధానింపబడి విద్యావైద్యం వంటి సదుపాయాలను పొందుతూ ప్రజలు సంతోషంగా ఉన్న ఈ సమయంలో మావోయిస్టులు తిరిగి అశాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలకు పాల్పడే మావోయిస్టులకు రానున్న సమయంలో తెలంగాణ పోలీస్ శాఖ గట్టి దెబ్బ కొడుతుందని హెచ్చరించారు. నక్సలిజం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో శరవేగంగా దూసుకుపోతుందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఐజీలు నాగిరెడ్డి, ప్రభాకర్ రావు, నవీన్ చంద్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఓఎస్డీలు సురేష్ కుమార్, శోభన్ కుమార్, ఏఎస్పీలు శరత్ చంద్ర పవారస్, సాయి చైతన్య , గౌస్ ఆలం, తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed