జమ్మికుంట సీఐని సత్కరించిన డీజీపీ

by  |
జమ్మికుంట సీఐని సత్కరించిన డీజీపీ
X

దిశ, క్రైమ్ బ్యూరో: దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో 10వ స్థానంలో నిలిచిన జమ్మికుంట ఇన్‌స్పెక్టర్ సృజన్ రెడ్డిని డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించి, సత్కరించారు. నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, కరీంనగర్ కమిషనర్ కమలాసన్ రెడ్డిలతో జమ్మికుంట ఇన్ స్పెక్టర్ సృజన్ రెడ్డి శుక్రవారం కలిశారు. అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఉత్తమ పౌర సేవలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, నేరాల పరిశోధన, మహిళా భద్రత, ఎస్సీ, ఎస్టీ కేసులు, మిస్సింగ్ కేసులు తదితర పరిశోధనలను త్వరితగతిన పూర్తి చేయడంలో జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఉత్తమ ఫలితాలు సాధించినందుకు దేశంలోనే అత్యుత్తమ 10వ స్థానంలో నిలిచినట్టు తెలిపారు. ఈ కృషిలో హోంగార్డు స్థాయి నుంచి ఇన్‌స్పెక్టర్ వరకూ ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావడం వల్లనే దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.

అంతేగాకుండా, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా రెండేండ్లు పోలీస్ స్టేషన్లు టాప్ టెన్‌లో నిలవడం పట్ల కమిషనర్ కమలాసన్ రెడ్డిని అభినందించారు. ఈ సందర్భగా చొప్పదండి, జమ్మికుంట పోలీస్ స్టేషన్లలో హోమ్ గార్డ్ ఆఫీసర్ నుంచి ఉన్నతాధికారి వరకూ ప్రతి ఒక్కరికీ డీజీపీ నగదు పురస్కారాన్ని అందజేశారు. అంతేగాకుండా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జీవన్ రక్షా మెడల్ రాష్ట్రపతి పతకం పొందిన ఇన్ స్పెక్టర్ సజన్ రెడ్డిని డీజీపీ శాలువాతో సత్కరించారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధి మడిపల్లి గ్రామంలో చేద బావిలో పడి ప్రాణాపాయస్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను తన ప్రాణాలను లెక్కచేయకుండా కాపాడినందుకు గుర్తింపుగా సృజన్ రెడ్డికి జీవన్ రక్షా మెడల్ మెడల్ లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవలను అందచేయాలని సీఐ సృజన్ రెడ్డిని డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.

Next Story

Most Viewed