ఆ ప్రాంతం 99,99,999 అద్భుతమైన శిల్పాలకు నిలయం..

by Disha Web Desk 20 |
ఆ ప్రాంతం 99,99,999 అద్భుతమైన శిల్పాలకు నిలయం..
X

దిశ, ఫీచర్స్ : భారతదేశం అద్భుతమైన శిల్పకళలకు, ప్రసిద్ది చెందిన ఆలయాలకు నెలవు. ఈ పురాతన కట్టడాల వెనుక, శిల్పకళల వెనుక ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ఒక ఆలయం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయంలోని రహస్యాలని ఛేదించేందుకు ఎంతో మంది ప్రయత్నించినా ఫలితం శూన్యం అని చరిత్ర చెబుతుంది. ఇంతటి ప్రత్యేకమైన ఆలయంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 99 లక్షల 99 వేల 999 విగ్రహాలు ఉన్నాయి. ఇంతటి అద్బుతమైన ఆలయం ఎక్కడ ఉంది, అక్కడి రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


మనం ప్రస్తావిస్తున్న ఆలయం త్రిపుర రాజధాని అగర్తల నుండి దాదాపు 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం పేరు ఉనకోటి. ఇక్కడ మొత్తం 99 లక్షల 99 వేల 999 రాతి విగ్రహాలు ఉన్నాయని, వీటి రహస్యాలను ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారని చెప్పారు. ఉదాహరణకు ఈ విగ్రహాలను ఎవరు తయారు చేశారు, వాటిని ఎప్పుడు చెక్కారు అన్న విషయాలు ఇప్పటికీ వెలువడలేదు. అంతే కాదు ఇక్కడ ఒక్క కోటికి 1 తగ్గించి ఎందుకు శిల్పాలు చెక్కారు అన్న రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ఈ రహస్య విగ్రహాల సంఖ్య కారణంగా ఈ ప్రాంతానికి ఉనకోటి అని పేరు వచ్చిందని చెబుతారు. అంటే కోటిలో ఒకటి తక్కువ అని అర్థం.

దట్టమైన అడవులు, చిత్తడి ప్రాంతాలతో నిండిన కొండ ప్రాంతాన్ని ఉనకోటిని రహస్యాలు నిండిన ప్రదేశం అని పిలుస్తారు. అయితే అడవి మధ్యలో లక్షల విగ్రహాలను ఎలా నిర్మించగలిగారు అనేది అందరి మనసులో మెదిలే ప్రశ్న. ఎందుకంటే దీనికి సంవత్సరాలు కాలం పడుతుంది. ఇంతకు ముందు ఈ ప్రాంతం చుట్టూ ఎవరూ నివసించలేదని సమాచారం.


ఈ ప్రాంతానికి శివుని శాపం..

ఆలయంలో రాతితో చెక్కిన హిందూ దేవుళ్ళ, దేవతల విగ్రహాల గురించి అనేక పురాణ కథనాలు ఉన్నాయి. ఈ కథలలో ఒకటి శివునికి సంబంధించినది. పురాణకథనం ప్రకారం ఒకప్పుడు శివునితో సహా కోటి మంది దేవతలు ఎక్కడికో ప్రయాణాన్ని ప్రారంభించారట. అప్పటికే రాత్రి కావడంతో ఇతర దేవతలు శివుడిని ఉనకోటి వద్ద ఆగి విశ్రాంతి తీసుకుందామని అడగడంతో శివుడు అంగీకరించాడట. కానీ సూర్యోదయానికి ముందే అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని శివుడు చెప్పాడట. కానీ సూర్యోదయ సమయంలో శివుడు మాత్రమే మేల్కొనగలిగాడు. మిగతా దేవతలు నిద్రపోతూనే ఉన్నారట. అది చూసిన శివుడు కోపించి అందరినీ శపించి అందరినీ శిలగా మార్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఇక్కడ 99 లక్షల 99 వేల 999 విగ్రహాలు ఉన్నాయని చెబుతారు.


విగ్రహాల గురించి మరొక కథనం..

శివుడు దేవతలకు ఇచ్చిన శాపం మాత్రమే కాకుండా, మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. దీని ప్రకారం పూర్వం కాలు అనే హస్తకళాకారుడు ఉండేవాడట. అతను శివుడు పార్వతి ఉన్న కైలాస పర్వతానికి వెళ్లాలనుకున్నాడట. కానీ అది సాధ్యం కాలేదు. అయితే హస్తకళాకారుల మొండితనం కారణంగా ఒక్క రాత్రిలో కోటి మంది దేవతల విగ్రహాలను తయారు చేస్తే తనతో పాటు కైలాసానికి తీసుకెళ్తానని శివుడు చెప్పాడట. అది విన్న హస్తకళాకారుడు హృదయపూర్వకంగా పని చేయడం ప్రారంభించాడు. గ్రహాలను ఒక్కొక్కటిగా చేయడం ప్రారంభించాడు. అతను రాత్రంతా విగ్రహాలను తయారు చేశాడట. కాని ఉదయం లెక్కించినప్పుడు అతను ఒక విగ్రహం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నాడట. ఈ కారణంగా శివుడు ఆ శిల్పిని తనతో తీసుకెళ్లలేదని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడే ఈ ఆలయం స్థాపించారని, ఈ ఆలయానికి ఉనకోటి అని పేరు వచ్చిందని ప్రతీతి.

Next Story