మూడు చుక్కల నీటితో దాహం తీరుస్తున్న చెరువు..

by Disha Web Desk 20 |
మూడు చుక్కల నీటితో దాహం తీరుస్తున్న చెరువు..
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో ఎన్నో అంతుచిక్కని అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలను ఎంత ఛేదించాలన్నా అసలు ఎప్పటికీ సాధ్యం కాదు. ఇప్పుడు అలాంటి ఒక రహస్యమైన చెరువు గురించి మనం చెప్పుకుందాం. ఈ చెరువు ఎంతో లోతు ఉంది అనే విషయాన్ని ఎన్ని సార్లు కనిపెడదామన్నా కనుక్కోలేపోయారట. అంతేకాదు సాధారణంగా దాహం వేసినప్పుడు మగ్గుల నిండ నీళ్లు తాగి దాహాన్ని తీర్చుకుంటాం. కానీ ఈ చెరువులోని నీళ్లను కేవలం 3 చుక్కలు తాగితే ఎంతటి దాహం అయినా తీరిపోతుందని చెబుతారు. వింటుంటే చాలా వింతగా ఉంది కదా.. సమ్మర్ లో ఇలాంటి చెరువు మన దగ్గరలో ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఇంతటి అద్భుతమైన చెరువు మధ్యప్రదేశ్‌లో రాష్ట్రంలోని ఛతర్‌పూర్ జిల్లాలో భీమ్‌కుండ్ లో ఉంది.

పురాణ గాథ..

మహాభారత కాలంలో పాండవులు వనవాస సమయంలో ఒక అడవి గుండా ప్రయాణం సాగిస్తున్నారు. ఆ సమయంలో ద్రౌపదికి దాహం వేసింది. అప్పుడు ఐదుగురు సోదరులు సమీపంలో నీటి కోసం వెతికారు. కానీ ఎక్కడా నీటిజాడ కనిపించలేదు. అప్పుడు ధర్మరాజు నకులుడికి పాతాళంలో లోతుగా ఉన్న నీటిని గుర్తించగల సామర్థ్యం ఉందని గుర్తు చేశాడు. ఆయన మాటను అంగీకరించిన నకులుడు నేలను తాకుతూ ధ్యానం చేశాడు. ఏ ప్రదేశంలో నీటి వనరు ఉందో నకులుడు తెలుసుకున్నాడు. కానీ నీటిని ఎలా బయటికి తీసుకురావాలో తెలియక అలాగే ఉండిపోయారు.

ద్రౌపది దాహంతో విలవిలలాడినప్పుడు, భీముడు తన గదను తీసుకొని నిర్దేశించిన ప్రదేశంలో కొట్టాడు. భీముని గద దెబ్బకు భూమి పై అనేక పొరల్లో రంధ్రం ఏర్పడి నీరు కనిపించింది. కానీ నీటి వనరు భూమి ఉపరితలం నుండి ముప్పై అడుగుల దిగువన ఉంది. దాంతో యుధిష్ఠిరుడు అర్జునుడితో ఇలా అంటారు. ఇప్పుడు నీ విలువిద్య నైపుణ్యంతో నీటికి మార్గం వేయవలసి ఉంటుందని చెప్పాడు. అది విన్న అర్జునుడు తన విల్లు పై బాణం వేసి, తన బాణాలతో మెట్లు కట్టారు. ద్రౌపదిని విల్లు మెట్ల ద్వారా నీటి వనరు వద్దకు తీసుకెళ్లారు. ఈ చెరువు భీముని గదతో సృష్టించినందుకు దీనికి భీమ్‌కుండ్ అని పేరు వచ్చింది.

అందుకే ఇది నిశ్శబ్ద అగ్నిపర్వతం అని అంటారు.

భీమ్‌కుండ్ నిశ్శబ్ద అగ్నిపర్వతం అని నమ్ముతారు. దీని లోతు గురించి చెప్పాలంటే ఇప్పటివరకు చాలా మంది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, డైవర్ల ద్వారా దాని లోతును తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ చెరువు అడుగుభాగాన్ని ఎవరూ కనుగొనలేదు. చెరువులో ఎనభై అడుగుల లోతులో బలమైన నీటి ప్రవాహాలు ప్రవహిస్తున్నాయని, ఇది బహుశా సముద్రంలోకి కలుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, భీమ్‌కుండ్ లోతు ఇప్పటికీ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలకు మిస్టరీగా మిగిలిపోయింది.

ఈ భీమ్‌కుండ్‌లో స్నానం చేయడం వల్ల తీవ్రమైన చర్మవ్యాధులు కూడా నయమవుతాయని ఒక నమ్మకం. ఇది కాకుండా, మీకు ఎంత దాహం వేసినా, కేవలం మూడు చుక్కలతో దాహం తీరుతుంది. అంతే కాదు దేశంలో ఏదైనా పెద్ద సంక్షోభం సంభవించినప్పుడు, ఈ జలాశయం నీటిమట్టం పెరుగుతుంది. అంటే ఈ చెరువు ఇప్పటికీ విపత్తు సంకేతాలను ఇస్తుంది.

Next Story

Most Viewed