నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం.. విశిష్టత ఏంటంటే?

by Yella Dhawani Reddy |

హిందూవులు అత్యంత పవిత్రంగా భావించే మాసాలలో శ్రావణ మాసం కూడా ఒకటి.

నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం.. విశిష్టత ఏంటంటే?
X

దిశ, వెబ్ డెస్క్: హిందూవులు అత్యంత పవిత్రంగా భావించే మాసాలలో శ్రావణ మాసం కూడా ఒకటి. ఎందుకంటే.. ఈ మాసాన్ని ఉపవాసాలు, పూజలు, నోములు, ఆధ్యాత్మిక సాధకను అనువైన సమయంగా భావిస్తారు. అందుకే ఈ నెల రోజుల పాటు పూజలతో ఇళ్లు, గుళ్లు కళకళలాడుతుంటాయి. శ్రావణ మాసాన్ని 'భక్తి, శుద్ధి, సాధన'కు సమయంగా భావించడమే కాక, ఈ కాలంలో చేసే పూజలు ఎంతో ఫలప్రదంగా ఉంటాయని విశ్వాసం. ఇక ఇది సాధారణంగా జులై చివరి వారం లేదా ఆగస్టు ప్రారంభంలో ప్రారంభమవుతుంది. మరీ నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం.. శ్రావణ మాసం శివ కేశవులకు ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతారు. సముద్ర మథనం సమయంలో వెలువడ్డ హాలాహలాన్ని శివుడు లోక కళ్యాణం కోసం సేవించిన మాసం ఈ శ్రావణ మాసంగా చెబుతారు. అందుకే ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు శ్రావణ సోమవారం రోజున ఉపవాసాలు ఉండి శివయ్యను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలాగే, శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం కావడంతో ఈ మాసం ఆయనకు కూడా ఎంతో ప్రీతికరమైనది. ఈనెలలో విష్ణుపూజలు, సత్యనారాయణ వ్రతాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయంటారు. అందుకే తిథులతో కూడా సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా ఈ మాసంలో పూజలు, పండుగలు చేసుకుంటారు.

శ్రావణ మాసం జోరు వర్షాలు కురిసే సమయంలో వస్తుంది. ఈ మాసంలో వాతావరణ మార్పులు, వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. జంతువులకు, మనుషులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో, పూర్వీకులు ఉపవాసాలు, ఆహార నియమాలు పాటించేందుకు ఈ మాసాన్ని నిబంధనల కాలంగా రూపొందించారు. శుద్ధి, నియమశీలతతో శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేసేందుకు ఈ ఉపవాస విధానం ఉపయోగపడుతుంది. ఇలా శ్రావణ మాసం భక్తి, పరమార్థం, శాస్త్రత – మూడింటి మేళవింపుతో విశిష్టంగా నిలుస్తుంది.

Next Story