Pakisthan MahaShiva Temple పాకిస్తాన్ లో పరమేశ్వరుని మహిమ... రోజురోజుకీ పెరుగుతున్న శివలింగం

by Muthe.Rajitha |

మన దేశంలో మహాశివుణ్ణి(MahaShiva) ఆరాధించేవారు కోట్లలో ఉంటారు.

Pakisthan MahaShiva Temple పాకిస్తాన్ లో పరమేశ్వరుని మహిమ... రోజురోజుకీ పెరుగుతున్న శివలింగం
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో మహాశివుణ్ణి(MahaShiva) ఆరాధించేవారు కోట్లలో ఉంటారు. అయితే హిందువులు ఉన్న చోట పరమశివుడు, ప్రళయకాల రుద్రుడు, శివయ్య, భోళా శంకరుడు, అర్ధనారీశ్వరుడు, ముక్కింటి వంటి ఎన్నో పేర్లతో పిలవబడతాడు. ఇక ఆయన లీలలకైతే లెక్కేలేదు. ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు.. రాజు పేద అనే బేధం లేకుండా.. ఏ పేరుతో అయినా.. మనసావాచా తనను స్మరిస్తే రాక్షసుడైనా సరే వరాలివ్వడానికి పరుగెత్తుకుంటూ వస్తాడు అంటారు. అందుకే శివాలయాలు అన్నీ ఏడాది పొడుగునా నిత్యం శివనామ స్మరణతో స్మరణతో మార్మోమోగుతాయి. దేవాలయాల్లో లింగ రూపంలో దర్శనమిచ్చే మహాశివుడు.. కొన్ని ప్రత్యేక ఆలయాల్లో మాత్రం నిరంతరం పెరుగుతూ ఉండటం అనే వింత కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయం కూడా అదే కోవకు చెందుతుంది. మరి ఆ ఆలయం ఏంటి? ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకతలు ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.

ఆలయ పురాణం..

పాకిస్థాన్(Pakisthan) లోని ఉమర్‌కోట్‌(Umarkot) లోని ఓ దేవాలయంలో ఉన్న శివలింగం కథ ఆలయ పురాణాల ప్రకారం.. వందలాది ఏళ్ల కింద ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక బయళ్లు ఉండేవి. పశువులు కాసే కొందరు తమ పశువులను మేత కోసం ఇక్కడకు తీసుకువచ్చేవారు. అందులో కొన్ని ఆవులు ఒక ప్రాంతానికి వెళ్లి పాలిస్తుండేవి. ఆవులు ఎక్కడికి వెళ్లి పాలు ఇస్తున్నాయన్నా ఆసక్తితో ఆవుల కాపరి ఒకరు అక్కడకు వెళ్లి పరిశీలించగా అది శివలింగమని తేలింది. ఈ విషయాన్ని స్థానికులకు తెలపగా వారు ఆ లింగానికి పూజలు ప్రారంభించారు. అలా భక్తులతో పూజలు అందుకుంటున్న శివలింగం ఇప్పటికీ పెరుగుతుండటం విశేషం. మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీయగా, ఇప్పుడు ఆ వలయాన్ని దాటి లింగం ఉంది.

శివరాత్రికి ప్రత్యేక పూజలు

పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి లక్షలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఆ సమయంలో శంభో శంకర నామస్మరణతో ప్రతిధ్వనిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా పెద్దది. దీంతో పర్వదినం వేళ భక్తులకు తగినట్టుగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. పాక్ లో ఉన్న వేలాది మంది భక్తులు ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి ఆరోజు తండోపతండాలుగా ఇక్కడికి చేరుకుంటారు.

ఏమిటీ ఉమర్‌కోట్‌ ప్రత్యేకత

సింధ్‌లోని ఉమర్‌కోట్‌గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్‌కోట్‌ అనేవారు. ముస్లిం పాలకుల కాలంలో ఉమర్‌కోట్‌గా మారింది. దేశ విభజనకు ముందు అవిభక్త భారత్‌లోని సింధ్‌రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాక్‌గా పేర్కొంటున్న ఈ ప్రాంతంలో లక్షలాదిమంది హిందువులు ఉండేవారు. పాకిస్థాన్​లోని ఏ నగరానికి లేని విశిష్టత ఉమర్‌కోట్‌కు ఉంది. ఈ నగర జనాభాలో దాదాపు 80 శాతం వరకు హిందువులే కావడం గమనార్హం. మతపరమైన వైషమ్యాలు లేవని స్థానికులు చెబుతుంటారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు శివమందిరం ప్రధాన కేంద్రంగా ఉండటం విశేషం. దేశ విభజన అనంతరం ఎక్కువ శాతం మంది హిందువులు భారత్‌కు వచ్చేశారు. అయితే కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్‌ సమాజంలో భాగమయ్యారు. ఇప్పటికీ పాక్‌లో వేలాది హిందూ ఆలయాలు, గురుద్వారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే భక్తులతో అలరారుతుండగా, వేలాది కట్టడాలు కనీస సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి.

Next Story