Tirumala: తిరుమలలో రేపటి నుంచి సాలకట్ల వసంతోత్సవాలు

by Yella Dhawani Reddy |

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో (Tirumala) రేపటి (గురువారం) నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు (Salakatla Vasanthotsavam) ప్రారంభం కానున్నాయి.

Tirumala: తిరుమలలో రేపటి నుంచి సాలకట్ల వసంతోత్సవాలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో (Tirumala) రేపటి (గురువారం) నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు (Salakatla Vasanthotsavam) ప్రారంభం కానున్నాయి. ఈనెల 10 నుంచి 12 వరకు ఈ ఉత్సవాలు వైభవంగా జరుగున్నాయి. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి మూడు రోజుల ముందు నుంచి ఈ ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. ఇక ఉత్సవాల్లో మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేసి, అభిషేక నివేదనలు పూర్తైన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

ఇక రెండో రోజు స్వామివారు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. అలాగే, ప్రతి రోజు సాయంత్రం ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.

వసంత ఋతువులో జరిగే ఈ ఉత్సవాలు కాబట్టి 'వసంతోత్సవం' అని పిలుస్తారు. ఇక ఈ ఉత్సవాల నేపథ్యంలో ఈ మూడు రోజుల పాటు స్వామివారి కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను TTD రద్దు చేసింది.

Next Story