21 ఏళ్ల తరువాత తెరుచుకున్న రామాలయం.. అన్ని ఏండ్లు ఎందుకు మూసేశారో తెలుసా ?

by Disha Web Desk 20 |
21 ఏళ్ల తరువాత తెరుచుకున్న రామాలయం.. అన్ని ఏండ్లు ఎందుకు మూసేశారో తెలుసా ?
X

దిశ, ఫీచర్స్ : కొన్ని ముఖ్యమైన తేదీల్లో తప్పించి ఏ ఆలయాన్ని కూడా మూసివేయరు. ఆలయంలోని మూలవిరాట్‌కు తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం వేళల్లో కైంకర్యాలు నిర్వహించాలి. అలా నిర్వహించని పక్షంలో అరిష్టం జరుగుతుందని విశ్వసిస్తారు. ఆగమశాస్త్రనియమాల ప్రకారం నిర్మించిన ఆలయాలను ఆ నియమాల ప్రకారమే కైంకర్యాలు నిర్వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిలో లోపం రానివ్వకూడదు. అయితే, కొన్ని కారణాల వలన ఓ రామాలయాన్ని 21 ఏళ్లపాటు మూసేయ్యాల్సి వచ్చింది. మరి అలా మూసి ఉంచిన ఆ రామాలయం ఎక్కడ ఉంది? ఎందుకు మూసేశారో తెలుసుకుందాం.

అయోధ్యలో రామాలయం నిర్మాణం తరువాత, దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రాములవారి ఆలయాలను పునరుద్దరించేందుకు ప్రజలు నడుం బిగించారు. అనేక గ్రామాల్లో పాతకాలంనాటి ఆలయాలను తిరిగి పున:నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 21 ఏళ్లుగా మూతబడిన ఓ రామాలయం తెరుచుకుంది. ఆర్మీ జవానులు దీనికోసం శ్రమించారు. భయాందోళనల మధ్య ఏళ్ల తరబడి మూసేసిన ఆలయాన్ని పునరుద్దరించారు. దీంతో ఆ గ్రామంలో ఆనందాలు వెల్లివిరిశాయి. గ్రామస్తులంతా కలిసి సంబరాలు చేసుకున్నారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా...

చత్తీస్‌గడ్‌లోని సుఖ్మాజిల్లాలోని లఖాపాల్‌, కేరళపెండా గ్రామాల సమీపంలో ఈ ఆలయం ఉంది. చత్తీస్‌గడ్‌లోని సుఖ్మా జిల్లా అంటే మావోయిస్టులకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పాలి. ఇక్కడ నిత్యం కాల్పుల మోతతో దద్దరిల్లిపోతుంటుంది. అటవీప్రాంతంలోని ప్రజల మధ్య సామరస్యం నెలకొనేందుకు బీహారీ మహారాజు లఖాపాల్‌, కేరళపెండా గ్రామాల మధ్యన రామాలయాన్ని నిర్మించారు. కొంతకాలం ఆలయం కార్యక్రమాలు సజావుగా సాగాయి. ఆ తరువాత మావోల బెదిరింపుల కారణంగా ఆలయాన్ని 2003 లో మూసేశారు. మావోల తాకిడి కొంత తగ్గినప్పటికీ ఆలయాన్ని తెరిచేందుకు గ్రామస్తులు ధైర్యం చేయలేకపోయారు. ఇలాంటి సమయంలో సీఆర్‌పీఎఫ్‌ 74వ బెటాలియన్‌ కోసం కేరళపెండా సమీపంలోని లఖాపాల్‌లో క్యాంప్‌ ఏర్పాటు చేశారు.

క్యాంప్‌ సమీపంలోని పురాతనమైన రామాలయం గురించి తెలుసుకున్న ఆర్మీ బెటాలియన్‌ దాని గురించిన వివరాలను గ్రామస్తులను అడిగి ఎందుకు మూసివేశారో తెలుసుకున్నారు. ఆలయాన్ని తిరిగి తెరిపించి పూజలు నిర్వహించడం వల్ల మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆలయానికి వస్తారని, తద్వారా ఆయా గ్రామాల్లో చైతన్యం నెలకొంటుందని ఆర్మీ సిబ్బంది భావించారు. ఆలయం తెరిచే బాధ్యతను ఆర్మీ జవానులు భుజాన వేసుకున్నారు. మూసేసిన ఆలయాన్ని తెరిచి శుభ్రంచేశారు. అనంతరం సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయాన్ని గ్రామపెద్దలకు అప్పగించారు. దీంతో ఆలయ చుట్టుప్రక్కల మారుమూల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయాన్ని సందర్శించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మావోలు ఏర్పాటు చేసుకున్న స్థూపాన్ని సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు కూల్చివేశారు. 21 ఏళ్ల తరువాత తెరుచుకున్న ఆలయాన్ని, ఆలయంలోని రాములవారిని చూసి భక్తులు మురిసిపోతున్నారు. జవానులకు సెల్యూట్‌ చేస్తున్నారు.

Next Story

Most Viewed