మామకు షాకిచ్చిన 'దేవుడు'.. అతడికి బిడ్డను అప్పగించక తప్పలేదుగా..

by Disha Web Desk 20 |
మామకు షాకిచ్చిన దేవుడు.. అతడికి బిడ్డను అప్పగించక తప్పలేదుగా..
X

దిశ, వెబ్‌డెస్క్ : పూర్వ కాలంలో ఇచ్చిన మాటకు ఖచ్చితంగా కట్టుబడే వారు. మాటపోతే మళ్లీ రాదని ఎంతకష్టమైనా ఆ వాగ్ధానాన్ని నెరవేర్చుకునే వారు. పెళ్లిల విషయంలోనూ అదే ఒరవడి కొనసాగేది. మేనరికం వివాహాల్లో బిడ్డ పుట్టిన తొలి రోజుల్లో నా తమ్ముడికి.., అల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని అక్కలు, బావలు మాట ఇచ్చేవారు. వాళ్లు పెద్దయ్యాక ఇచ్చిన మాట ప్రకారం వివాహం చేసేవారు. ఇప్పటికీ ఈ పద్ధతి కొనసాగుతూనే ఉంది. అయితే దేవతల కాలంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

దేవుడి సాక్షిగా తన బిడ్డను ఇచ్చి వివాహం చేస్తానని మాట తప్పిన మామకు బుద్ధి చెప్పడానికి ఏకంగా ఆ దేవుడే దిగివచ్చాడట. అతడు చేసిన వాగ్ధానానికి సాక్షిగా నిలిచి వివాహం జరిపించాడట. అప్పటి నుంచి ఆ దేవున్ని సాక్షి భావన్నారాయణ స్వామిగా కొలుస్తారు. పంచభావన్నారయన స్వామి ఆలయాలు మొత్తం ఐదు ఉన్నాయి. ఈ పంచభావన్నారాయణ స్వామి ఆలయాల్లో సాక్షి భావన్నారాయణ ఆలయం ఒకటి.

ఈ అద్భుత ఆలయం ఎక్కడో కాదు.. మన తెలుగురాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోనే ఉంది. ఈ ఆలయం గుంటూరుకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నూరు అనే గ్రామంలో ఉంది. పొన్నూరు అనే పదం పొన్ + ఊరు అనే రెండు తమిళ పదాల కలయికతో ఒచ్చింది. పొన్ అంటే బంగారం అని ఊరు అంటే గ్రామం అని అర్థం వస్తుంది.

అందుకే ఈ గ్రామాన్ని 'బంగారు గ్రామం' అంటే 'స్వర్ణపురి'గా పిలుస్తారు. ఈ ఊరి పేరులోనే కాదు సాక్షిభావన్నారాయణస్వామి ఆలయంలో కూడా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ని శిల్ప సౌందర్యం కన్నుల పండువగా ఉంటుంది. ఈ ఆలయంలో విశాలాక్షి సమేతంగా విశ్వేశ్వరుడు దర్శనమిస్తాడు. శివకేశవ అభేద్యానికి ఈ ఆలయం మారు పేరు.

సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు తన భక్తుని కోసం కాశీవిశ్వేశ్వర సమేతుడై ఆ గ్రామానికి వచ్చి భక్తుని వివాహం జరిగేలా చేశాడని పురాణాలు చెపుతున్నాయి. ఆ కారణంగానే పొన్నూరును 'చిన్న కాశీ' అని కూడా అంటారు. ఆ నారాయణున్ని సాక్షిభావన్నారాయణుడు అని పిలుస్తారు. అసలు ఆ భక్తుడు ఎవరు, ఎందుకు ఆ నారాయణుడు వచ్చి సాక్ష్యం చెప్పాడు ఇప్పుడు తెలుసుకుందాం.

కేశవయ్య అనే ఓ బ్రాహ్మణ భక్తుడు పొన్నూరులో ఉండేవాడు. పెళ్లయి ఎన్నేండ్లయినా అతనికి సంతానం కలగలేదు. దాంతో అతను అనేక పుణ్యక్షేత్రాలు దర్శించాడు. తనతో పాటు తన కుటుంబ సభ్యులను, మేనల్లుడు గోవిందుడిని కూడా వెంటబెట్టుకొని వెళ్లేవాడు. ఒకనాడు కేశవయ్యతో వెళ్లిన గోవిందుడు ఈసారి నీకు ఆడపిల్ల ఖచ్చితంగా పుడుతుంది. అలా పుడితే తనకు ఇచ్చి వివాహం చేయాల్సిందిగా కోరతాడు.

దాంతో ఆ కేశవయ్య తనకు ఆడసంతానం కలిగితే మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని నారాయణుడి సన్నిధిలో ప్రమాణం చేశాడట. ఆ తరువాత కేశవయ్య దంపతులకు ఆడపిల్ల జన్మించింది. ఎన్నో పూజల పుణ్యఫలంగా పొందిన ఆ చిన్నారికి అక్కలక్ష్మి అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అక్కలక్ష్మి యుక్తవయస్సుకు రాగానే గోవిందుడు తన మరదలిని తనకిచ్చి వివాహం చేయమని కేశవయ్యను అడిగాడు.

గూనివాడైన గోవిందుడికి తన కూతురిని ఇచ్చి వివాహం చేయాడనికి కేశవయ్య నిరాకరించాడు. నీకు ఎప్పుడు మాట ఇచ్చాను దానికి ఏదైనా సాక్ష్యం ఉందా అని కేశవయ్య గోవిందున్ని ప్రశ్నించాడట. ఆ మాటలు విన్న గోవిందుడు వెంటనే కాశీకి పయనం అయ్యాడట. కాశీలోని నారాయణుడిని దేవాలయం వద్దకు వెళ్లి స్వామి వారిని ప్రసన్నం చేసుకున్నాడట. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొని బాధపడ్డాడట.

కేశవయ్య తన కూతురిని ఇచ్చి వివాహం చేస్తానని నీ సమక్షంలోనే చెప్పాడు కదా అని ప్రశ్నించాడట. నీవే వచ్చి ఈ విషయం తన మామకు చెప్పాలని నారాయణున్ని సాక్ష్యం చెప్పడానికి తన వెంట రావలసిందిగా కోరాడట. అలా గోవిందుడు కోరగానే నారాయణుడు గోవిందుడి వెంట పొన్నూరు చేరుకున్నాడు.

తన ఆలయంలో జరిగిన విషయం మొత్తం అక్కడివారికి తెలిపాడట. అక్కలక్ష్మిని గోవిందునికి ఇచ్చి వివాహం చేయమని కేశవయ్యకు చెప్పి శిలా రూపం దాల్చాడు. అలా గోవిందుని వివాహాన్ని జరిపించి సాక్షి భావనారాయణుడిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడని స్థలపురాణం చెబుతోంది. ఎవరికైనా వివాహ సంబంధం విషయంలో ఇబ్బందులు ఉంటే వారు ఈ స్వామివారిని సందర్శించుకొంటే ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.



Next Story

Most Viewed