తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు.. భారీ భద్రతతో నేటి నుంచి చార్‌ధామ్‌ యాత్ర షురూ

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-30 06:59:08  IST  )

ఇవాళ అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని చార్‌ధామ్ (Chardham) యాత్ర ప్రారంభమైంది.

తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు.. భారీ భద్రతతో నేటి నుంచి చార్‌ధామ్‌ యాత్ర షురూ
X

దిశ, వెబ్ డెస్క్: ఇవాళ అక్షయ తృతీయ (Akshaya tritiya) పర్వదినాన్ని పురస్కరించుకుని చార్‌ధామ్ (Chardham) యాత్ర ప్రారంభమైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో ఉండే యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను చార్‌ధామ్‌గా పేర్కొంటారు. హిందువులు ఈ చార్‌ధామ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే, ఈ ఆలయాలు ప్రతి ఏటా శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు మూసే ఉంటాయి. అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి భక్తుల సందర్శనకు తెరుస్తారు.

ఈ సందర్భంగా ఉత్తర్‌కాశీ జిల్లాలోని గంగోత్రి (Gangotri), యమునోత్రి (Yamunotri) ఆలయ ద్వారాలను ఉదయం 10:30 గంటలకు వేద మంత్రాల నడుమ తెరిచారు. ఇక శుక్రవారం రోజు కేదార్‌నాథ్ ఆలయం, ఆదివారం రోజున బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి. మంగళవారం ఉదయం 11.57 గంటలకు అభిజిత్ ముహూర్తంలో ముఖబా గ్రామం నుంచి గంగోత్రి ధామ్‌కు బయలుదేరిన గంగామాత్ర డోలి.. బుధవారం ఉదయం అక్షయ తృతీయ రోజున డోలి గంగోత్రి ధామ్ చేరుకుంది. అలాగే, యమున పల్లకీ ఈ ఉదయం ఖర్సాలిలోని తన శీతాకాల నివాసం నుంచి బయలుదేరి యమునోత్రి ధామ్‌కు చేరింది. ఇక సాంప్రదాయ కత్రువులు ముగిసిన అనంతరం 11:55 గంటల నుంచి భక్తులకు దర్శనార్థం అనుమతిస్తున్నారు.

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి చార్‌ధామ్‌ యాత్రకు పటిష్టమైన భద్రతను కల్పించనున్నారు. చార్‌ధామ్ యాత్ర మార్గాన్ని 15 సూపర్ జోన్‌లు, 41 జోన్‌లు, 217 సెక్టార్‌లుగా విభజించారు. ఈసారి యాత్ర మార్గంలో మొత్తం 624 సీసీటీవీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. తొమ్మిది మంది ఏఎస్‌పీ, డీఎస్పీ స్థాయి అధికారులను యాత్ర మార్గాల్లో మోహరించనున్నారు. కాగా, గతేడాది చార్‌ధామ్‌ యాత్రలో 48లక్షల మంది పాల్గొన్నారు.

Next Story