తొలి బోనం ఎన్ని వందల ఏళ్ల క్రితందో తెలుసా ? బోనాలను ఎందుకు సమర్పిస్తారు?

by Disha Web Desk 20 |
తొలి బోనం ఎన్ని వందల ఏళ్ల క్రితందో తెలుసా ? బోనాలను ఎందుకు సమర్పిస్తారు?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పండగలలో బోనాలు ఒకటి. ఆషాఢమాసంలో జరుపుకునే ఈ బోనాల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. బోనాల పండగ వచ్చిందంటే చాలు గ్రామాల్లో, పట్టణాల్లో ఎంతో కోలాహలంగా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు బోనాల పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇంత ఇష్టంగా జరుపుకునే బోనాల పండగ విశిష్టత, ప్రాముఖ్యత, చరిత్ర ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బోనాల ఆచారం ఈనాటిది కాదు..

గ్రామదేవతలకు బోనం సమర్పించే ఆచారం ఈనాటిది కాదు. ఈ బోనాల పండుగ పల్లవ రాజుల కాలానికి ముందు కాలం నుంచే ఉండేదని చరిత్ర చెబుతోంది. అంతే కాదు శ్రీకృష్ణ దేవరాయలు 15వ శతాబ్దంలో ఏడుకోల్ల ఎల్లమ్మ నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనం సమర్పించినట్లు చరిత్ర చెబుతుంది. అదేవిధంగా సర్వాయి పాపన్న కరీంనగర్ హుస్నాబాద్‌లో 1676వ సంవత్సరంలో ఎల్లమ్మగుడిని కట్టించి బోనాలు సమర్పించాడట.

ఇకపోతే 1869వ సంవత్సరంలో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి వ్యాపించి వేలాది మంది చనిపోతుంటే అక్కడి వారు గ్రామ దేవతలను పూజలు జరిపించి బోనం ఎత్తారట. దీంతో ప్లేగు వ్యాధి తగ్గిపోయినట్లు చరిత్ర చెబుతారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో బోనాల పండగ కొనసాగుతుందని నిజాం ప్రభువుల కాలంలో కూడా ఈ పండగ ఘనంగా జరిగేదని చరిత్ర చెబుతోంది. నిజాం ప్రభువులు ముస్లీం మతానికి చెందిన వారైనా బోనాల పండగను జరిపేందుకు పూర్తిగా సహకరించేవారట. దానికి నిదర్శనమే గోల్కోండలోని జగదాంబ అమ్మవారి ఆలయం అని చెబుతారు.

బోనం అంటే ఏంటి..

బోనం అంటే భోజనం అని అర్థం. బోనాల పండగలో గ్రామదేవతలకు కొత్త కుండలో భోజనం వండుతారు. అలాగే మరో చిన్న మట్టి ముంతలో బెల్లం పానకం పోస్తారు. మహిళలు వండిన అన్నంతో పాటు ఉల్లిపాయలతో చేసిన అన్నం, పెరుగు, పాలు, బెల్లంను మట్టి లేదా ఇత్తడి, రాగి కుండల్లో పెట్టి వాటిని అలంకరిస్తారు. ఆ తరువాత ఆ కుండలపై దివ్వెపెట్టి ఆడపడుచులు నెత్తి పై బోనం ఎత్తుకుని, ఒక చేతిలో వేప ఆకులు పట్టుకుని డప్పు చప్పుళ్లతో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలతో నృత్యాలు చేస్తూ వెళ్లి గ్రామదేవతలైన పోలేరమ్మ, మారెమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మగా పిలిచే గ్రామ దేవతలకు బోనంని, సాకని సమర్పిస్తారు. వీరితో పాటు మొక్కులు తీర్చుకునేందుకు వేటపోతులను కూడా తీసుకువెళతారు. ఇలా ప్రతియేడు బోనాలు సమర్పిస్తే గ్రామ దేవతలు శాంతించి గ్రామాన్ని చల్లగా చూస్తారని భక్తుల నమ్మకం.

బోనం ఆచారాలు..

ఆషాడమాసంలో ఆడబిడ్డ పుట్టింటికి వచ్చినట్టే గ్రామ దేవత కూడా పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. అలా పుట్టింటికి వచ్చే గ్రామ దేవతకు సాదరంగా ఆహ్వానం పలికి భక్తి శ్రద్ధలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారట. ఇలా చేయడాన్ని ఊరడి అంటారట. ఇదే కాలక్రమంలో బోనాలుగా మారింది.

Read more:

ఉప్పు దానం చేస్తే మంచిది కాదా..? హిందూ ధర్మం ఏం చెబుతుంది..



Next Story

Most Viewed