కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూ.. సర్వదర్శనానికి భారీగా సమయం

by Naga Rani Yarlagadda |

తిరుమలకు శనివారం భక్తులు పోటెత్తారు. వారాంతం, వచ్చేవారం గ్రహణం, టెన్త్ పరీక్షలు కూడా త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో రద్దీ పెరిగింది.

కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూ.. సర్వదర్శనానికి భారీగా సమయం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయానికి కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోగా.. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 6 గంటలు, రూ.300 శీఘ్రదర్శనం టోకెన్లు ఉన్నవారికి 4 గంటల్లో శ్రీవారి దర్శనం జరగనుంది. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శన సమయాలు మారవచ్చు. నిన్న (శుక్రవారం) స్వామివారిని 67,952 మంది భక్తులు దర్శించుకోగా.. 27,414 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు సమకూరింది.

ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏప్రిల్ -2026 నెలకు సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. జనరల్ సేవా టికెట్లు బుక్ చేసుకున్నవారు.. బుకింగ్ తేదీ రోజున తిరుపతి, తిరుమలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పరకామణి సేవకులు సేవా బుకింగ్ తేదీకి ఒకరోజు ముందు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య రిపోర్ట్ చేయాలి. కాగా.. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగుతుండగా.. మార్చి 2వ తేదీనాటికి అవి పూర్తికానున్నాయి. మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకూ స్వామివారి ఆలయాన్ని మూసివేయనున్నారు.

Next Story