హత్యాయత్నం కేసులో దేవినేని ఉమాకు ఊరట..

by  |
హత్యాయత్నం కేసులో దేవినేని ఉమాకు ఊరట..
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుకు రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణా జిల్లా జి.కొండూరు పీఎస్‌లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ కేసులు నమోదు అయ్యాయి. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం దేవినేని ఉమా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే ఈ కేసుల్లో తనను అక్రమంగా ఇరికించారంటూ దేవినేని ఉమా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి.

బుధవారం తీర్పు వెల్లడించిన న్యాయస్థానం దేవినేని ఉమాకు బెయిల్ మంజూరు చేసింది. ఇకపోతే దేవినేని ఉమాపై ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాద‌న‌లు వినిపించారు. దేవినేని ఉమా ఏ నేరానికీ పాల్పడలేదని వాదనలు వినిపించారు. కేసు విచారణ దశలో ఉండగా బెయిల్ మంజూరు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఇరువాదనలు విన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దేవినేని ఉమాకు బెయిల్ మంజూరు కావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Next Story