ఫంట్‌పైనే తెప్పోత్సవం.. ఈ ఏడాది కూడా దుర్గమ్మ నదీ విహారం లేనట్లే

by  |
ఫంట్‌పైనే తెప్పోత్సవం.. ఈ ఏడాది కూడా దుర్గమ్మ నదీ విహారం లేనట్లే
X

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సామాన్య భక్తులు అనుకున్నదానికంటే భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు. దసరా ఉత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. తొమ్మిదో రోజైన శుక్రవారం విజయదశమితో సంబరాలు ముగియనున్నాయి. పూజాది కార్యక్రమాల అనంతరం తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. ఇక దుర్గమ్మ నదీ విహారానికి ఆలయ అర్చకులు, అధికారులు ఏర్పాటు చేశారు. అయితే కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో ఈ ఏడాది జగన్మాత నదీ విహారం లేనట్లేనని అధికారులు ప్రకటించారు. ఫంట్‌పై ఆగమన నియమ నిబంధనల ప్రకారం పూజలు, తెప్పోత్సవం మాత్రమే నిర్వహిస్తామని అధికారయంత్రాంగం ప్రకటించింది.

ఫంట్‌పై ఆగమన నిబంధనల ప్రకారం తెప్పోత్సవం: కలెక్టర్ జె.నివాస్

నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకోవడంతో గురువారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన కో ఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెప్పోత్సవంపై చర్చించారు. తెప్పోత్సవం నిర్వహిస్తే ప్రమాదం ఉంటుందని, ఫంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. కృష్ణా నదిలో లక్ష క్యూసెక్ ల వరకు నీరు వదులుతున్నారు. అందుకే ఈసారి కూడా ఫంటుపై మాత్రమే పూజలు నిర్వహించాలని నిర్ణయించాం. తెప్పోత్సవం ఆగమన నియమ నిబంధనలకు అనుగుణంగా జరుపుతాం. తెప్పోత్సవం ప్రాంగణంలో ప్రజలకు అనుమతి లేదు. సుమారు 5:30 గంటలకు పూజాది కార్యక్రమాల తర్వాత తెప్పోత్సవం ఉంటుంది. నవరాత్రి సంబరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగాయి.. భక్తులు కూడా సహకరించారు. ఇంకా రెండుమూడు రోజులు భక్తులు, భవానీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేశాం అని కలెక్టర్ జె. నివాస్ తెలిపారు.

బందోబస్తు ఏర్పాటు చేశాం: సీపీ బత్తిన శ్రీనివాసులు

గురువారం సాయంత్రం 5:30 గంటలకు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని దానికి పోలీస్ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఏడు రోజులుగా దసరా ఉత్సవాల విజయవంతంగా జరిగాయి. అనుకున్న దానికంటే భక్తులు ఎక్కువగా వచ్చారు. రేపు భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది కనుక అన్ని ఏర్పాట్లు చేశాం అని సీపీ వెల్లడించారు. కనకదుర్గ ఫ్లై ఓవర్, కుమ్మరిపాలెం వైపు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే గురువారం నవమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉదయం నుంచే గుడిలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. నవరాత్రులు ముగింపు దశకు చేరుకోవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది.


Next Story

Most Viewed