దేశానికి రోడ్ మ్యాప్‌లా కాశీ అభివృద్ది : పీఎం మోడీ

by  |
pm-modi
X

న్యూఢిల్లీ: కాశీ అభివృద్ధి భారతదేశానికి రోడ్ మ్యాప్‌లా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అఖిల భారత మేయర్ల సదస్సును ప్రారంభించిన ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘దేశంలోని చాలా నగరాలు సంప్రదాయానికి చిహ్నంగా ఉన్నాయి. అదే విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ ఆధునిక యుగంలో, ఈ నగరాల ప్రాచీనత కూడా అంతే ముఖ్యమైనది. వారసత్వం, స్థానిక నైపుణ్యాలను ఎలా కాపాడుకోవాలో ఈ నగరాలు మనకు నేర్పుతాయి. ప్రస్తుతం ఉన్న కట్టడాలను ధ్వంసం చేయడం మార్గం కాదు. పునర్నిర్మాణం, పరిరక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఆధునిక కాలపు అవసరాలకు అనుగుణంగా ఇది జరగాలి’ అని అన్నారు.

నగరాల్లోని వీధిలైట్లు, ఇళ్లలో ఎల్‌ఈడీ బల్బులు విరివిగా వినియోగించేలా చూడాలని మేయర్లను కోరారు. ప్రస్తుతం ఉన్న పథకాలను కొత్త అవసరాలకు వినియోగించి ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ స్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎన్‌సీసీ విభాగాలను సంసిద్ధంగా ఉంచాలని మేయర్లను కోరారు. ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సుగమ్య భారత్ అభియాన్ ప్రకారం తమ నగరంలోని ప్రతి సౌకర్యం దివ్యాంగులకు అనుకూలంగా ఉండేలా చూడాలని ఆయన మేయర్లను కోరారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు నగరాలు చోదక శక్తి అని ఉద్ఘాటించారు. నగరాన్ని శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మార్చేలా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను బలోపేతం చేయాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగీ అధిత్యనాధ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, 120 నగరాల మేయర్లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed