ప్రజల అవ‌స‌రాల‌కు అనుగుణంగా అభివృద్ధి : ఎర్ర‌బెల్లి

by  |
ప్రజల అవ‌స‌రాల‌కు అనుగుణంగా అభివృద్ధి : ఎర్ర‌బెల్లి
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. డిస్ర్టిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై వరంగల్ అర్బన్ కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… రూ.58. 63 కోట్లతో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో 119 ర‌కాల‌ పనులకు ఆమోదం తెలిపిన‌ట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు సుమారు రూ. 10.9 కోట్ల‌తో 79 అభివృద్ధి పనులు పూర్తి చేశామని, 11 పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు.

మొద‌టి స‌మావేశంలో నిర్ణ‌యించిన ప‌నుల‌ను ఇంకా ప్రారంభించ‌ని నేప‌థ్యంలో ఆ ప‌నుల‌ను ర‌ద్దు చేయాల‌ని తీర్మానించిన‌ట్లు తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి ప‌నుల‌కు, మౌలిక వసతుల కల్పనకు కావాల్సిన పనులు గుర్తించుటకు సంబంధిత అధికారులతో చర్చించి నివేదికలు సిద్ధం చేయాల‌ని సూచించారు. ఇటీవ‌ల నగరంలో వరదల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు ఈ నిధుల‌ను వినియోగించుకోవాల‌ని సూచించారు. అలాగే త్వ‌ర‌లోనే ఐన‌వోలు, కొత్తకొండ జాతర నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభించిన రోడ్ల అభివృద్ధి, మ‌ర‌మ్మ‌తులకు నిధుల‌ను ఖ‌ర్చు చేయాల‌ని సూచించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్క‌ర్‌, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, పార్లమెంట్ సభ్యులు ద‌యాక‌ర్‌, ఎమ్మెల్యేలు న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌, తాటికొండ రాజ‌య్య‌, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, మునిసిప‌ల్‌ కమిషనర్ ప‌మేలా సత్పతి పాల్గొన్నారు

Next Story

Most Viewed