దేవరయంజాల్​ భూముల్లో దొంగ అవతారమెత్తింది ప్రభువే..

by  |
Revanth Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రాన్ని పాలించే ప్రభువే దొంగ అవతారమెత్తాడని, విలువైన భూములను ఆక్రమించుకున్నాడని కాంగ్రెస్​ఎంపీ రేవంత్​రెడ్డి ఫైర్​ అయ్యారు. టీఆర్ఎస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్​ భూ వ్యవహారంపై స్పందించిన ఎంపీ రేవంత్ రెడ్డి.. కేసీఆర్​సొంత పత్రిక నమస్తే తెలంగాణకే ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, రెండు ఎకరాల దేవాలయ భూములను ఆక్రమించుకుని ఆ పత్రికను ముద్రిస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడిన రేవంత్​రెడ్డి భూ ఆక్రమణలపై మండిపడ్డారు.

కేసీఆర్​ కొడుకు మంత్రి కేటీఆర్​, నమస్తే తెలంగాణ పత్రిక పేరుమీద, కేసీఆర్​ బంధువు భూంరావు పేర్లతో దేవాలయ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ సేకరించామని, త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షాను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు రేవంత్​రెడ్డి ప్రకటించారు. నిషేదిత జాబితాలోని 437 సర్వే నెంబర్​లో కేటీఆర్, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్​రావుకు భూములున్నాయని పేర్కొన్నారు. ఈటల రాజేందర్​ వ్యవహారంలో ఎంత స్పీడ్​గా విచారణ చేశారో ఈ భూములపై కూడా అంతే స్పీడ్ తో ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు. కానీ సీఎం కేసీఆర్​ వేసే ఎంక్వయిరీమీద నమ్మకం లేదన్నారు.

మంత్రి మల్లారెడ్డి కూడా సర్వే నెంబర్​ 658లో ఏడు ఎకరాలను ఆక్రమించుకుని విలాసవంతమైన ఫాంహౌస్​ను నిర్మించుకున్నారన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఈ భూములు వీళ్లకు ఎలా రిజిస్ట్రేషన్​ అయ్యాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆన్​లైన్​లో దేవరయంజాల్​ భూముల వివరాలు లేకుండా చేశారని, 1531 ఎకరాల దేవాదాయ భూములను ధరణిలో ఎందుకు హైడ్​ చేశారని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లో 9 జిల్లాల భూ రికార్డులు ఉన్నాయని, కానీ రంగారెడ్డి జిల్లా భూముల వివరాలు లేవని, వీటిని ఎందుకు దాచారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

1920 నుంచి 2021 వరకు 95 ఏండ్ల భూ రికార్డులను బయటకు తీయాలని, అందుకే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. ఈ భూములపై తెలంగాణ ఉద్యమ సంఘాలు, రాజకీయ పార్టీలు, జేఏసీలను కలుపుకుని క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్తామని, అవసరమైతే టీఆర్ఎస్​ నేతలు కూడా వస్తే తీసుకుపోతామని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఈ భూముల విచారణ కమిటీలో రఘునందన్​రావును నియమించారని, కేసీఆర్​ బంధువు అయిన రఘునందన్​రావు ఏం విచారణ చేస్తారని ప్రశ్నించారు. రఘునందన్​రావును కమిటీలో నియమించడంతోనే సీఎం కేసీఆర్​ చిత్తశుద్ధి తేలిపోయిందని, అందుకే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. దీనిపై బీజేపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించేలా కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, ఎంపీ బండి సంజయ్​ లేఖ రాయాలని సూచించారు.



Next Story

Most Viewed