ఎంపీపీ ఒత్తిడి తాళలేక..దేవరకద్ర ఏపీవో ఆత్మహత్యాయత్నం

by  |
ఎంపీపీ ఒత్తిడి తాళలేక..దేవరకద్ర ఏపీవో ఆత్మహత్యాయత్నం
X

దిశ, మహబూబ్ నగర్ :
అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి భరించలేక ఓ మండల అధికారిణి ఆత్మహత్యకు యత్నించింది. ఇటీవలే ఓ సర్పంచ్ భర్త ఒత్తిడి తట్టుకోలేక పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే జిల్లాలో ఇలాంటి మరో ఘటన చోటుచేసుకోవడంతో అధికార వర్గాలు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకివెళితే..దేవరకద్ర మండలం ఏపీఓ భారతీ దేవరకద్ర మండల ఎంపీపీ రమా శ్రీకాంత్ ఒత్తిడి తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. తాము అధికారంలో ఉన్నాము కావున ప్రభుత్వ పనులన్నీ వారి కనుసన్నల్లోనే జరగాలని ఆదేశించారు. చెప్పిన మాట వినకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరింపులకు గురిచేశారు. వారి చర్యలతో తీవ్ర ఒత్తిడికి గురైన భారతి మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఏది ఏమైనా అధికార పార్టీలో ఉన్నామని, తమ కింద పనిచేసే వారిని బెదిరింపులకు, ఒత్తిడికి గురిచేయడం భావ్యం కాదని పలువురు ఆరోపిస్తున్నారు.

Next Story