చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ధర్మాన ఫైర్

by  |
చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ధర్మాన ఫైర్
X

దిశ, విశాఖపట్నం: ప్రభుత్వం భూములు అమ్మేస్తోందని చంద్రబాబు పత్రికలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… నవరత్నాలు, నాడు-నేడు పథకాల నిధులు కోసం భూములు వేలం వేస్తున్నామని, అది పూర్తి పారదర్శకతో దేశంలో ఎవరైనా వాటిని కొనుగోలు చేసేలా ఈ వేలం చేపడుతున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల్లో లబ్ధి చేకూర్చిన వారికి ఎన్ని భూములు కట్టబెట్టారో అందరికీ తెలుసునని మండిపడ్డారు.

టీడీపీ ప్రభుత్వ అవినీతిపై పత్రికల్లో రాయాలంటే పెద్ద గ్రంథం అవుతుందని తెలిపారు. రాజధాని పేరుతో పేదల నుంచి బలవంతంగా అసైన్డ్ భూములు సేకరించి, పెద్దలకు కట్టబెట్టింది మీ హయాంలో కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూన రవి, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు గురివింద చందంగా మాట్లాడుతున్నారు. తప్పులు చెప్పి కాలక్షేపం చేయొద్దని సూచించారు. గీతం వంటి సంస్థలు ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటా మంటే గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. మొబైల్ కోర్టులు ఏర్పాటు చేసి భూ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామన్నారు.

Next Story

Most Viewed