ఆ సమస్యలపై మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తా :ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by  |
MLC Jeevan Reddy
X

దిశ, కరీంనగర్ సిటీ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీల నియామకంపై కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. విద్యా వాలంటీర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి శాసన మండలి వేదికగా కృషి చేయాలని కరీంనగర్‌లో తెలంగాణ ట్రైన్డ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12 వేల విద్యా వాలంటీర్లను పునరుద్ధరించాలని, గత విద్యా సంవత్సరంలో విద్యా వాలంటీర్లతో పూర్తిస్థాయిలో పని చేయించుకొని వారికి జీతాలు చెల్లించకుండా, వారి జీవితాలతో ప్రభుత్వం చెలగాట మాడుతోందని దుయ్యబట్టారు.

కరోనా కారణంగా ప్రైవేటు స్కూళ్లు మూతపడి ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మంది విద్యార్థులు చేరుతున్నారని వారికి సరిపడా ఉపాధ్యాయులను నియమించటంలో నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. తక్షణమే విద్యా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, చొప్పదండి అసెంబ్లీ ఇంచార్జి డాక్టర్ మేడిపల్లి సత్యం, నాయకులు సమద్ నవాబ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, అంజుమన్ తరక్ఖి, ఉర్దూ అధ్యక్షుడు సర్వర్ షా బియబాని, ట్రైన్డ్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు ముత్తహరోద్దీన్, ఇష్థియాక్, ఇజహర్ హుస్సేన్, తెలుగు ట్రైన్డ్ టీచర్లు రేఖ, అనుపమ, నగేష్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed