అక్రమ నిర్మాణాల కూల్చివేత.. బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్

by  |
Demolition illegal structures
X

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇప్పటికే ఆయా డివిజన్లలోని సర్కార్ స్థలాల్లో వెలిసిన నిర్మాణాలను కూలుస్తోన్న అధికారులు తాజాగా.. బుధవారం శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామం సర్వే నెంబర్ 37లోని ప్రభుత్వ భూమిలో వెలసిన 208 గుడిసెలను, ఇతర అక్రమ నిర్మాణాలను 16 రెవెన్యూ టీంలు, 500 మంది పోలీసులు, 10 జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ కూల్చివేతలను పర్యవేక్షిస్తున్నారు. గుడిసెలను తొలగించే సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.

బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్..

గోపన్‌పల్లిలో జరుగుతోన్న కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. వారికి మద్దతుగా బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అక్కడికి చేరుకొని కూల్చివేతలు ఆపాలని నిరసన వ్యక్తం చేశారు. స్థానికులతో కలిసి కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేయగా బీజేపీ కార్యకర్తలను, కార్పొరేటర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, గచ్చిబౌలి స్టేషన్‌కు తరలించారు.


Next Story